Team India wins T20 series:రాజ్కోట్లో శ్రీలంకతో జరిగిన మూడో టీ-20లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకను 91 పరుగుల తేడాతో చిత్తు చేసి… మూడు టీ-20ల సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. అద్భుత సెంచరీ చేసిన సూర్య మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోగా… మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా అక్షర్ పటేల్ నిలిచాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. నాలుగో బంతికే ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడాడు. 16 బంతుల్లోనే 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 35 రన్స్ చేసి ఔటయ్యాడు. అప్పుడు మొదలైంది సూర్య సునామీ. క్రీజులోకి వచ్చింది మొదలు లంక బౌలర్లను చితగ్గొట్టాడు… సూర్య. బంతి ఎలా వేసినా సరే… దాన్ని బౌండరీ దాటిస్తా అనేలా రెచ్చిపోయి ఆడాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సూర్య… ఆ తర్వాత సెంచరీ అందుకోడానికి కేవలం 19 బంతులు మాత్రమే తీసుకున్నాడు. గిల్తో మూడో వికెట్కు 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సూర్య… ఆఖర్లో అక్షర్ పటేల్తో కలిసి ఆరో వికెట్కు 39 పరుగులు జోడించాడు. చివరి వరకూ ఆడిన స్కై… 51 బంతుల్లోనే 112 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 9 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. సూర్య ధాటి బ్యాటింగ్తో… 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీగా స్కోరు చేసింది… టీమిండియా.
229 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక… ధాటిగానే ఇన్నింగ్ ప్రారంభించింది. మెండిస్, నిస్సంక తొలి వికెట్ కు 44 రన్స్ జోడించారు. దాంతో… లంక ఎక్కడ లక్ష్యం దిశగా సాగుతుందోనని భారత అభిమానులు కంగారు పడ్డారు. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు వరుస వికెట్లు తీస్తూ లంకను దెబ్బకొట్టారు.
ఆ జట్టు బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. చివరికి 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటై… 91 పరుగుల తేడాతో ఓడిపోయింది… శ్రీలంక. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3 వికెట్లు తీయగా… పాండ్యా, చాహల్, ఉమ్రాన్ మాలిక్ తలో రెండు వికెట్లు తీశారు. ఒక వికెట్ అక్షర్ పటేల్కు దక్కింది.