Chetan Sharma: 2022 టీ-20 ప్రపంచకప్ లో టీమిండియా ఘోర వైఫల్యం తర్వాత… చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా… నలుగురు సభ్యులతో కూడిన కమిటీని రద్దు చేసింది. ఈ నిర్ణయం తీసుకుని 2 నెలలు కూడా తిరగలేదు. మళ్లీ చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్గా నియమించింది… బీసీసీఐ. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోని వ్యక్తిని మళ్లీ ఎలా చీఫ్ సెలక్టర్గా ఎంపిక చేస్తారంటూ భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చీఫ్ సెలక్టర్గా పాత వ్యక్తినే నియమించి… కేవలం నలుగురు సభ్యుల్ని మార్చినంత మాత్రాన, జట్టు తలరాత మారిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా ప్రకటించిన సెలెక్షన్ కమిటీలో… చీఫ్ సెలక్టర్గా చేతన్ శర్మే ఎంపికయ్యాడు. నలుగురు సభ్యులు మాత్రం కొత్తవాళ్లు. సలీల్ అంకోలా, శివ్సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, శరత్లు సభ్యులుగా ఎంపికయ్యారు. వీరిలో జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయిన శరత్… సౌత్ జోన్కు చెందినవాడు. మాజీ సీమర్ సుబ్రతో బెనర్జీ ఈస్ట్ జోన్కు చెందినవాడు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు సలీల్ అంకోలా వెస్ట్ జోన్ నుంచి, మాజీ టెస్టు ఓపెనర్ శివ్సుందర్ దాస్ సెంట్రల్ జోన్ నుంచి కొత్త కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు.
సెలెక్టర్ పదవుల కోసం మొత్తం 600 అప్లికేషన్లు రాగా, చర్చల తర్వాత ఇంటర్వూల కోసం 11 మంది అభ్యర్థులతో జాబితా రూపొందించింది… క్రికెట్ సలహా సంఘం. ఇందులో చేతన్ శర్మ పేరు కూడా ఉంది. గతవారం బీసీసీఐ సమీక్ష సమావేశానికి అతను హాజరు కావడంతో… మళ్లీ అతడే చీఫ్ సెలక్టర్గా ఎంపికయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక పాత కమిటీలో సభ్యుడైన హర్విందర్ సింగ్ కూడా దరఖాస్తు చేసుకున్నా… అతనికి మరో ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎంపికైన సెలక్షన్ కమిటీ పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది. ప్రతీ ఏడాది బీసీసీఐ కాంట్రాక్ట్ను పునరుద్ధరిస్తూ ఉంటుంది.