VeeraSimhaReddy: ఎంత పెద్ద హీరో అయినా.. రాజమౌళి సినిమాలో నటించాలనే కోరిక ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ రాజమౌళి. అలాంటి జక్కన్న.. బాలకృష్ణతో సినిమా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు వస్తున్నాయి. ఆ ప్రచారానికి కారణం.. వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఫంక్షన్ లో బాలయ్య ప్రసంగం.
రాజమౌళి-బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కేది చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రమే అంటున్నారు. ఇక, హిస్టారికల్ మూవీ అంటే అందుకు బాలయ్యను మించిన నటుడు ఇంకెవరు ఉంటారు? గతంలో గౌతమీపుత్ర శాతకర్ణతో సంచలన విజయం దక్కించుకున్నారు. అంతకుముందు, అనేక పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి బాలయ్య బాబుతో రాజమౌళి సినిమా తీస్తే..! అది ఇంకో లెవల్.. అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ వారిద్దరు కలిసి సినిమా చేయడమేంటి? ఈ ప్రచారంలో నిజమెంత? అసలీ వార్త ఎలా వచ్చింది? సోషల్ మీడియాలో వరుస కథనాలు ఎందుకు కనిపిస్తున్నాయి? అంటే అన్నిటికీ మూలం వీరసింహారెడ్డి ఫంక్షన్.
‘చెంఘీజ్ఖాన్ సినిమా చేయడం నా జీవితాశయం’ అంటూ శుక్రవారం రాత్రి జరిగిన ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి నటసింహం తన మనసులోని మాటను బయటపెట్టారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఆ సినిమా చేస్తానని చెప్పారు. ఇంకేం.. మనోళ్లు స్టోరీ అల్లేశారు. సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టేస్తున్నారు.
బాలకృష్ణ అనగానే.. అసలు చెంఘీజ్ఖాన్ ఎవరా అంటూ నెట్ లో తెగ ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు చెంఘీజ్ఖాన్. అనేక యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు. ఎంతటి యుద్ధ వీరుడైనా.. మహిళలు, ప్రజలపై అఘాయిత్యాలు, అరాచకాలు చేసేవాడని అంటారు. అలెగ్జాండర్ స్థాయి రాజైనా కూడా.. మంగోళియా కావడంతో అతనికి రావాల్సినంత ప్రాచుర్యం రాలేదంటారు. చాలా పవర్ ఫుల్ ఎలిమెంట్స్ ఉండే చెంఘీజ్ఖాన్ క్యారెక్టర్ ను బాలయ్య చేయాలను కోవడం ఆసక్తికరం.
అటు, రాజమౌళికి సైతం చెంఘీజ్ఖాన్ సినిమాపై ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఉంది. బాహుబలి సినిమాలో.. కట్టప్ప తలపై ప్రభాస్ కాలు పెట్టే సీన్.. తాను చూసిన ఓ చెంఘీజ్ఖాన్ మూవీ నుంచి ఇన్ స్పైర్ అయి తీసిందేనని స్వయంగా రాజమౌళినే గతంలో ఓ సందర్భంలో ప్రకటించారు. అలా, రాజమౌళి, బాలకృష్ణ కాంబినేషన్లో చెంఘీజ్ఖాన్ సినిమా తీస్తే తప్పేంటనేది అభిమానుల డిమాండ్. ఇక ఆ పవర్ ఫుల్ కథాంశంతో కూడిన చిత్రానికి రైటర్ ను కూడా ఫ్యాన్సే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకెవరు.. విజయేంద్ర ప్రసాదే.