Kamareddy: కామారెడ్డి రైతుల ఆందోళన. యావత్ తెలంగాణ ఉలిక్కిపడిన ఘటన. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఈ స్థాయిలో రైతు పోరాటం జరగలేదు. రైతు బంధు, ఉచిత విద్యుత్తు, అందుబాటులో ఎరువులు ఉండగా.. రైతులంతా హ్యాపీగా ఉన్నారంటూ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఘనంగా ప్రకటించుకుంది. అలాంటి రైతులే.. ఇప్పుడు కేసీఆర్ సర్కారుపై తిరుగుబాటు చేయడం ఊహించని షాక్. అసలేం జరిగిందని ఆరా తీస్తే.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే, స్వయంగా మంత్రి కేటీఆరే అధికారుల తీరుపై మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ గురించి రైతులకు విడమరిచి చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లోనే కలెక్టర్ కాస్త చొరవ తీసుకుని ఉంటే.. రైతుల ఆందోళన ఈ రేంజ్ లో జరిగి ఉండకపోయేదని అంటున్నారు.
అటు, రైతులు సైతం కలెక్టర్ పైనే గుర్రుగా ఉన్నారు. రైతుల నిరసన సెగ ఇంకా సర్కారు మీదకు మరలలేదు. కలెక్టర్ చుట్టూనే తిరుగుతోంది. వేలాది మంది రైతులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగానా.. కనీసం వారితో చర్చలకు ముందుకు రాలేదు ఆ ఉన్నతాధికారి. కావాలంటే ఓ 10 మంది రైతులు తనదగ్గరకు వచ్చి మాట్లాడొచ్చంటూ బాసిజం ప్రదర్శించారు. ఇలాంటి సందర్భాల్లో బాధితుల దగ్గరకే అధికారులు రావడం ఆనవాయితీ. కానీ, కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అన్నారు. వివాదం ఇంతగా ముదిరేందుకు కారణమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ పాటిల్ వ్యవహారశైలి ఇంతకుముందు సైతం ఇలానే వివాదాస్పదమైంది. ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కలెక్టర్ అడ్డంగా బుక్ అయ్యారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కలెక్టర్ పై సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి. రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామా రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించా రు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికే స్పష్టత లేకపోతే ఎలా? అని నిలదీయడంతో కలెక్టర్ తెల్లముఖం వేసుకోవాల్సి వచ్చింది. అక్కడితో ఆగిపోలేదు కేంద్రమంత్రి. రేషన్ దుకాణాల దగ్గర ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఎందుకు లేదని కామారెడ్డి కలెక్టర్ ను ప్రశ్నించారు. వెంటనే ప్రధాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ ఘటన బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం దగ్గర జరిగింది.
కలెక్టర్ కు కేంద్రమంత్రికి మధ్య జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు సైతం స్పందించారు. కేసీఆర్, కేటీఆర్ లు కూడా కేంద్రమంత్రి నిర్మల.. ఇలా సిల్లీ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడమేంటని విమర్శించారు. అది చూసుకొని.. రాష్ట్ర ప్రభుత్వ అండదండలు తనకు ఫుల్ గా ఉన్నాయని అనుకున్నారో ఏమో.. ఈసారి రైతుల విషయంలో కాస్త తగ్గి సమస్యను పరిష్కరించే దిశగా చొరవ తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కామారెడ్డి రైతుల ఉద్యమంతో.. కలెక్టర్ జితేశ్ పాటిల్ వ్యవహార శైలి మరోసారి చర్చకు వస్తోంది.