Bandi Sanjay: ఈసారి ముందస్తు ఉండదు.. కేసీఆర్ చెబుతున్న మాట. కానీ, ఆయన మాటలు ఎవరూ నమ్మట్లే. పక్కాగా ముఖ్యమంత్రి ముందస్తుకు వెళాతరని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. ఆ మేరకు ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. కాంగ్రెస్ అంత:కల్లోలాలతో సతమతమవుతుంటే.. బీజేపీ మాత్రం రేసుగుర్రంలా దూసుకుపోతోంది.
బీజేపీకి బలమైన అంశాలు రెండు. ఒకటి పెద్ద స్థాయి నేతలు. ఇంకోటి బూత్ స్థాయి కమిటీలు. బీజేపీ దేశంలో ఈ స్థాయిలో దుమ్మురేపడానికి ఈ రెండే ప్రధాన కారణం అంటారు. జాతీయ స్థాయిలో మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్, గడ్కరీ లాంటి నేతలు తమ ఛరిష్మాతో ఓటర్లను ఆకర్షిస్తుంటారు. ఇక గ్రామగ్రామాణ బూత్ కమిటీలతో పక్కా పోల్ మేనేజ్ మెంట్ చేస్తుంటారు. ప్రచార ఆర్భాటాల కంటే కూడా.. ఓటర్లను నేరుగా కలుస్తూ ప్రచారం చేయడమే బీజేపీ మొదటి నుంచీ అవలంభిస్తున్న వ్యూహం. అదే ఆ పార్టీ బలం. అందుకే, ఎలక్షన్లు అనగానే.. బూత్ కమిటీలపైనే మెయిన్ ఫోకస్ పెడుతుంది బీజేపీ.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించారు. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ.. కార్యకర్తలు రెడీగా ఉండాలంటూ పిలుపు ఇచ్చారు. పోలింగ్ బూత్ కమిటీల ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలే మూల స్తంభం అన్నారు. ప్రధాని మోదీ సైతం పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేసి.. సభ్యుల్లో ఉత్సాహం నింపారు బండి సంజయ్.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై పార్టీ శ్రేణులకు అవగాహన, ఇన్ఫర్మేషన్ అందించేందుకు ‘సరళ్’ పేరుతో ఓ యాప్ తీసుకొచ్చింది బీజేపీ. సరల్ యాప్ ను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. స్మార్ట్ సిటీ, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ, హరితహారం కింద కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టం చేయాలన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతు బంధు డబ్బులను బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయన్నారు. రాజకీయాల గురించి కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడండి అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు బండి సంజయ్.
సంఘటన్ రిపోర్టింగ్ అండ్ అనాలసిస్..కు షార్ట్ కట్ నేమ్ ‘సరళ్’. బూత్ స్థాయి నేతలకు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇవ్వడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. బూత్ స్థాయి కమిటీ సభ్యుల వివరాలను ఇందులో పొందుపరిచారు. నియోజకవర్గానికో సోషల్ మీడియా కన్వీనర్లను నియమించారు. బూత్ కమిటీ సభ్యులతో నేరుగా హైకమాండ్ ఎప్పటికప్పుడు టచ్ లోకి ఉండేలా సరళ్ యాప్ను రూపొందించారు. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో సరళ్ యాప్ను బీజేపీ విస్తృతంగా వినియోగించుకుంది. ఇప్పుడు తెలంగాణకూ సరళ్ ను తీసుకొచ్చారు కమలనాథులు.