Bandi Sanjay: రైతు పోరుతో కామారెడ్డి రణరంగంగా మారింది. బండి సంజయ్ రంగంలోకి దిగడంతో మరింత ఉద్రిక్తత రాజుకుంది. ఇండస్ట్రియల్ జోన్ కు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ప్రభుత్వ పెద్దల ఆస్తులకు 100 ఫీట్ల రోడ్డు వేసుకోవడానికే రైతుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. అక్కడికక్కడే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు బండి సంజయ్.
సడెన్ గా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు బండి సంజయ్. కలెక్టరేట్ ముందు కూర్చుంటా.. సీఎం కేసీఆర్, కలెక్టర్ ఎందుకు రారో చూస్తా.. అంటూ అక్కడే బైఠాయించారు. అసలే స్టేట్ ప్రెసిడెంట్. ఆయనొచ్చారని తెలిసి.. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, రైతులు కలెక్టరేట్ కు చేరుకున్నారు. వెంటనే పోలీసులు సైతం ఎంట్రీ ఇచ్చారు.
కలెక్టరేట్కు అర కిలోమీటరు దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొలగించి రైతులు, బీజేపీ కార్యకర్తలు ముందుకు చొచ్చుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. కలెక్టర్ వచ్చి కామారెడ్డి బహృత్ ప్రణాళికపై సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ బండి సంజయ్ను కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కలెక్టరేట్ ముందు బైఠాయించిన బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పరస్పరం తోపులాట జరిగింది. ఖాకీలు లాఠీలకు పని చెప్పారు. కొందరు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. బీజేపీ శ్రేణులు పోలీస్ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు.
పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని వాహనం ఎక్కించారు. ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసు వాహనంపై రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు రైతులను చెదరగొట్టి బండి సంజయ్ను కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. కామారెడ్డిలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది.