Weather: శుక్రవారం ఉదయం. నిద్ర లేచిన వాళ్లందరికీ షాక్. మంచు కమ్మేసింది. చలిగాలులు వణికించాయి. చినుకులు కూడా పడ్డాయి. సడెన్ గా ఈ కూల్ వెదర్ ఏంట్రా బాబూ అంటూ అంతా ఆశ్చర్యపోయారు. చలికి, గాలులకు గజగజ వణికిపోయారు. చలి తీవ్రత తెలంగాణలో మరో రెండు గంటల పాటు ఉంటుందని చెబుతున్నారు.
ఈ చలిగాలులు ఇక్కడివి కావు. హిమాలయాల నుంచి వస్తున్నాయట. ఉత్తర భారతంను గజగజ వణికిస్తున్నాయి. ఢిల్లీతో పాటు జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. మంచు బాగా కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. పంజాబ్, హరియాణా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు ఆవహించింది.
చలిగాలుల తీవ్రత మరో 24 గంటల పాటు కొనసాగుతుందని.. ఆ తర్వాత తగ్గే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటన చేసింది. చలి నుంచి రక్షణకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అస్తమా పేషెంట్లు, శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు, గతంలో కొవిడ్ సోకిన వాళ్లు చలి నుంచి తగు రక్షించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఢిల్లీలో అత్యంత కనిష్ట ఉష్ణోగతలు నమోదవుతున్నాయి. అయానగర్ లో 1.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్తార్ గంజ్లో 4 డిగ్రీలు, ఢిల్లీ రిడ్జ్లో 3.3 డిగ్రీల టెంపరేచర్ నమోదవడంతో.. దేశ రాజధాని నగరం చలి గుప్పిట్లో చిక్కుకుంది. ఉత్తరాది ప్రభావం మన దగ్గరా కనిపిస్తోంది. హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. మరో రెండు రోజులు చలితో జాగ్రత్త.