Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. కుట్ర పూరితంగా ఆంక్షలు విధిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మూడో రోజు పర్యటనలోనూ పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానిక బస్టాండ్ సమీపంలో రోడ్డుపైనే చంద్రబాబు బైఠాయించారు. సీఎం జగన్, పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు గుడిపల్లికి వెళ్లకుండా అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. జీవో నంబర్ 1 చట్టవిరుద్ధమైందని చంద్రబాబు అన్నారు. రాజమండ్రిలో సీఎం జగన్ మీటింగ్ పెట్టలేదా? రోడ్షో చేయలేదా? అని ప్రశ్నించారు. సీఎంను, వైసీపీని శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతానని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అరాచకాలకు తావులేదన్నారు.
పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూస్తే ప్రజలు సహకరిస్తారని చంద్రబాబు అన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారంతా దోషులేనని తెలిపారు. పోలీసులపై మరోసారి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏంటీ బానిసత్వం అని నిలదీశారు. బానిసలుగా బతకొద్దని సూచించారు. చట్టప్రకారం విధులు నిర్వర్తించాలని కోరారు. తనను కుప్పం నియోజకవర్గం నుంచి తిరిగి పంపాలని చూస్తున్నారని మండిపడ్డారు. కానీ తాను వెళ్లనని తేల్చిచెప్పారు. మిమ్మల్నే ఇక్కడి నుంచి పంపిస్తా అని పోలీసులను హెచ్చరించారు. తాను ప్రశ్నిస్తుంటే పోలీసు అధికారులు పారిపోతారా? సంబంధిత అధికారికి సిగ్గులేదా? చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంమీద కుప్పంలో తీవ్రఉద్రిక్తతల మధ్యే చంద్రబాబు టూర్ కొనసాగుతుంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నడంతో టెన్షన్ మరింత పెరిగింది.