Sankranthi Celebrations : సంక్రాంతి మాసంలో హరిదాసులు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు గతంలో కనిపించేవి. పల్లెల్లో ఇప్పటికి ఈ ఆచారం నామా మాత్రంగానే కనిపిస్తోంది. అదే నగరాల్లో వీటిని చూడటం కూడా గగనమే.
అసలు గంగిరెద్దుల్ని అందంగా ముస్తాబు చేసి ఇంటింటికి తీసుకొస్తుంటారు. హరిదాసులు నెత్తిమీద పాత్ర పెట్టుకుని హరి నామ స్మరణ చేస్తుంటారు. హరిదాసులు పెట్టుకునే పాత్ర కూడా భూమికి సంకేతంలా ఉండే గుండ్రని ఆకారంలోనే ఉంటుంది. అందులో బియ్యం వేయడమంటే..ధాన్యలక్ష్మిని మనం గౌరవించడమే. హరిదాసు విష్ణు సంకీర్తనం చేస్తుంటారు. విష్ణువు ఉన్న చోటకి ధాన్యలక్ష్మి చేరుతుంటుంది. లక్ష్మీని విష్ణువు దగ్గరకు చేర్చడానికి హరిదాసు మనకు అవకాశం ఇస్తున్నట్టుగా భావించాలి. భూమి లాంటి పాత్రలో బియ్యం వేస్తున్నామంటే..భూమి సస్యశ్యామలం అవ్వాలని మనం కోరుకుంటునట్టు అర్థం.
ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకోవడమే. పండుగ అంటే ఏ ఒక్కరో సంతోషంగా ఉండి మిగిలిన వాళ్లు దుఃఖంగా ఉండటం కాదు. అంతా సంతోషంగా జరుపుకునేదే పండుగ. సమాజం మొత్తం ఆనందంగా ఉండాలి.., సంక్షేమం పొందాలన్నది మన పెద్దల ఆలోచన. అందుకే హరిదాసు ఇంటికి రాగానే భూమిలాంటి ఆకారంలో ఉన్న పాత్రలో బియ్యం పోస్తే భూమి సస్యశ్యామలంగా ఉండి అందరూ బాగుంటారని మనం కోరుకున్నట్టు లెక్క. అష్టలక్ష్ములు అందరికి అందుబాటులో ఉండాలని అది మన కుటుంబం నుంచి ప్రారంభం కావాలని కుటుంబం అష్టైశ్వైర్యాలతో తులతూగుతూ ఉండాలని…కోరుతూ దీన్ని పదిమందికి పంచుతూ అందరూ పదికాలాలు ఆనందంగా ఉండాలన్న గొప్ప సంకేతాన్ని హరిదాసు చెబుతుంటారు.
గంగిరెద్దుల విషయానికి వస్తే సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ కనుమ. ఇది పశువులకి సంబంధించిన పండుగ. పాడికి ఆవులు, పంటకు ఎద్దులు ఉపయోగపడుతుంటాయి. గంగిరెద్దులు పశుజాతి మొత్తానికి సంకేతం. మనిషులు పశువుల ద్వారా చాలా ప్రయోజనాల పొందుతుంటారు. అందుకే కృతజ్ఞతాపూర్వకంగానే ఆ గంగిరెద్దులను అందంగా అలంకరించడం ఒక సంప్రదాయంగా పెట్టారు.
కేవలం ఆవుని పూజించడం మాత్రమే కాక గోవుల సంక్షేమాన్ని, పశుజాతి సంక్షేమాన్ని కోరుకునేలా ప్రకృతికి విరుద్దంగా పశుజాతి అంతరింప చేయాలన్న ఆలోచన రానీయకుండా చేయడానికి ఈపద్ధతి పెట్టారు. గంగిరెద్దు ముందు వెనకాల ఎత్తైన మూపరం ఉంటుంది. అది శివలింగం ఆకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తాను సంక్రాంతి సంబరాలకు హాజరు అయ్యానని చెప్పేందుకు సంకేతంగానే గంగిరెద్దు ఇంటి ముందుకు వస్తుందని అంటారు.