Google in NCLAT:కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా జరిమానా విధించిన కేసులో గూగుల్కు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్లో ఎదురుదెబ్బ తగిలింది. సీసీఐ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించేందుకు నిరాకరించిన ఎన్సీఎల్ఏటీ… జరిమానాలో 10 శాతాన్ని డిపాజిట్ చేయాలని గూగుల్ను ఆదేశించింది. సీసీఐకి నోటీసులు ఇవ్వడంతో పాటు మధ్యంతర స్టే మీద తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.
సీసీఐ ఇచ్చిన ఆదేశాలు జనవరి 19 నుంచి అమల్లోకి రానున్నాయి. వాటిపై తక్షణం స్టే విధించాలని గుగూల్, ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. భారతీయ యూజర్లు, డెవలపర్లు, తయారీ సంస్థలకు ఆండ్రాయిడ్తో గణనీయంగా ప్రయోజనాలు చేకూరాయని, భారత్ డిజిటల్ ఇండియాగా మారడానికి తాము తోడ్పడ్డామని పిటిషన్లో వివరించింది. గూగుల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి… ఆ సంస్థ గుత్తాధిపత్య దుర్వినియోగానికి పాల్పడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
ఆండ్రాయిడ్ మార్కెట్లో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు… ప్లే స్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస్తుందంటూ గత అక్టోబర్లో సీసీఐ రెండు దఫాలుగా రూ.2,274 కోట్ల జరిమానా విధించింది. ముందుగా రూ.1337.76 కోట్ల ఫైన్ విధించిన సీసీఐ… ఆ తర్వాత మరో నాలుగు రోజులకే రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న గూగుల్… తన పద్ధతి మార్చుకోవాలని సీసీఐ సూచించింది.
ఒక యాప్ ను అభివృద్ధి చేసిన డెవలపర్… అది యూజర్లకు చేర్చాలంటే యాప్ స్టోర్ పైనే ఆధార పడాలి. మన దేశంలో ఎక్కువగా వాడుతున్నవి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లే. దీంతో యాప్ డెవలపర్లు తమ యాప్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలంటే… గూగుల్ ప్లే స్టోర్ మీద ఆధార పడటం తప్ప వేరే దారి లేదు. ప్లే స్టోర్లో యాప్ లిస్ట్ చేయాలంటే గూగుల్ రూల్స్ కు తలొగ్గడంతో పాటు… గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ను అనుసరించాలి. ఇది గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేయడమేనని భావించిన సీసీఐ… గూగుల్కు భారీగా జరిమానా వడ్డించింది.