Employees In The New Year:2022 వెళ్లిపోయి 2023 వచ్చినా… ప్రైవేట్ ఉద్యోగులు మాత్రం బిక్కుబిక్కుమంటూనే బతుకుతున్నారు. కారణం… ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలీని అనిశ్చిత పరిస్థితి. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్… తొలగించబోయే ఉద్యోగుల సంఖ్యను 18 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. బిజినెస్ సాఫ్ట్వేర్ తయారీదారు అయిన సేల్స్ఫోర్స్ 8 వేల మందిపై వేటు వేయబోతోంది. ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలు కంపెనీలకే కాదు… ఇప్పుడు ఉద్యోగులకు కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు, కంపెనీ నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థ నుంచి తీసివేయాలనుకున్న ఉద్యోగుల సంఖ్యను 18 వేల మందికి పెంచుతున్నట్లు… అమెజాన్ సీఈఓ యాండీ జాస్సి సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తొలగింపులపై ఈ నెల 18 నుంచి ఉద్యోగులకు సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. అమెజాన్ ఫ్రెష్, అమెజాన్ స్టోర్స్, అమెజాన్ గో, పీఎక్స్టీ సంస్థల్లో పలు హోదాల్లోని ఉద్యోగాలు పోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. తీసేసిన ఉద్యోగులకు సంస్థ మద్దతు ఉంటుందని… చెల్లింపులతో పాటు ఆరోగ్య బీమా ప్రయోజనాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సహకారం అందిస్తామని తెలిపారు. అమెజాన్కు ఉన్న 3 లక్షల మంది సిబ్బందిలో… ఉద్వాసనలు 6 శాతమే. గత నవంబరులో 10 వేల మందిని తొలగిస్తామని అమెజాన్ ప్రకటించినపుడు… భారత్లో 200 నుంచి 300 మంది ఉద్యోగులపై ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. ఇప్పుడు తొలగించే ఉద్యోగుల సంఖ్యను 18 వేలకు పెంచడంతో… దేశంలోనూ తొలగింపులు ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో అమెజాన్కు 10 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
మరోవైపు, 80 వేల మంది సిబ్బంది కలిగిన సేల్స్ ఫోర్స్ కూడా… పది శాతం మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. అంటే 8 వేల మందిని ఇంటికి సాగనంపనుంది. కొవిడ్ సమయంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా ఎడాపెడా నియామకాలు చేపట్టామని… వాటికి, ఇప్పుడు ఉద్యోగుల తొలగింపునకు తానే కారణమని సేల్స్ఫోర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు.