India vs Sri Lanka : రెండో టీ-20లో శ్రీలంక చేతితో భారత్ చిత్తైంది. 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్ల చెత్త బౌలింగ్ కారణంగా శ్రీలంక భారీ స్కోరు చేసింది. ఛేజింగ్ లో టాపార్డర్ బ్యాటర్ల ఆట చూశాక టీమిండియాకు ఘోర పరాభవం తప్పదేమో అనిపించింది. కానీ అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ మావి పోరాడి… గెలుపుపై ఆశలు రేకెత్తించారు. కానీ, లక్ష్యం కొండంత ఉండటంతో… చివరికి ఓడిపోయారు. దాంతో శ్రీలంక 3 మ్యాచ్ ల సిరీస్ ను 1-1తో సమం చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన లంకకు… ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 80 రన్స్ జోడించారు. కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ చేయగా.. నిస్సంక 33 రన్స్ చేశాడు. వాళ్లిద్దరూ ఔటయ్యాక వరుసగా వికెట్లు పడిపోతూ రావడంతో 17వ ఓవర్ వరకూ లంక స్కోరు ఓ మాత్రంగానే ఉంది. కానీ… చివరి మూడు ఓవర్లలో లంక బ్యాటర్లు చెలరేగి ఆడారు. 18 బంతుల్లో ఏకంగా 59 రన్స్ చేశారు. కెప్టెన్ శనక 22 బంతుల్లోనే 56 రన్స్ చేయగా, అసలంక 19 బంతుల్లో 37 రన్స్ రాబట్టాడు. దాంతో… 20 ఓవర్లు ముగిసే సరికి లంక 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది.
207 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా బ్యాటర్లు దారుణంగా ఆడారు. మ్యాచ్ చూస్తున్న అభిమానులంతా ఓటమి ఖాయమనుకుని టీవీలు ఆఫ్ చేసేంత దారుణంగా వికెట్లు పారేసుకున్నారు. 5 ఓవర్లు కూడా పూర్తి కాకముందే… టీమిండియా టాపార్డర్ మొత్తం పెవిలియన్ చేరింది. ఇషాన్ కిషన్ 2, గిల్ 5, రాహుల్ త్రిపాఠి 5, కెప్టెన్ పాండ్యా 12 రన్స్ చేసి ఔటయ్యారు. దాంతో కాసేపు వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు… సూర్య, దీపక్ హుడా. కానీ పదో ఓవర్లో 9 రన్స్ చేసిన హుడా కూడా ఔట్ కావడంతో… 57 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 64 పరుగులే ఉండటం, మరో పది ఓవర్లలో 143 రన్స్ చేయాల్సి రావడం, సూర్య తప్ప గొప్ప బ్యాటర్లెవరూ లేకపోవడంతో… పాండ్యా సేన పనైపోయిందని అనుకున్నారంతా. టీమిండియాకు ఘోర ఓటమి తప్పదని ఫిక్సై పోయారు. కానీ… అక్షర్ పటేల్, సూర్య అద్భుతంగా పోరాడారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ చెలరేగి ఆడాడు. 31 బంతుల్లోనే 65 రన్స్ చేశాడు. ఓ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో సూర్య కూడా ఓ సిక్సర్ బాదడంతో మొత్తం 26 రన్స్ వచ్చాయి. దాంతో… టీమిండియా గెలుపుపై అభిమానుల్లో ఆశలు చిగురించాయి. కానీ… ఆరో వికెట్ కు 84 రన్స్ జోడించాక… హాఫ్ సెంచరీ చేసిన సూర్య ఔటయ్యాడు. ఆ తర్వాత శివమ్ మావితో కలిసి అక్షర్ పటేల్ పోరాడినా… లక్ష్యం భారీగా ఉండటంతో… విజయానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది… టీమిండియా. చివరికి 16 రన్స్ తేడాతో ఓడిపోయింది. లంక గెలుపులో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ శనకకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ-20 రేపు రాజ్ కోట్ లో జరగనుంది.