Arshdeep Singh : శ్రీలంకతో రెండో టీ-20లో టీమిండియా బౌలర్ల వైఫల్యంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. లంక చేతిలో ఓటమికి బౌలర్లే ప్రధాన కారణమని నిందిస్తున్నారు. భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం వల్లే… లంక స్కోరు 200 దాటిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అర్ష్దీప్ సింగ్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
లంకతో జరిగిన మ్యాచ్లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన అర్ష్దీప్ సింగ్… ఏకంగా 37 పరుగులు పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లలో కలిపి ఏకంగా ఐదు నోబాల్స్ విసిరాడు… అర్ష్దీప్. తొలి ఓవర్లో వరుసగా 3 నో బాల్స్ వేయడంతో పాటు ఏకంగా 19 రన్స్ ఇచ్చేశాడు. ఆ ఓవర్ చివరి ఒక్క బంతికే 3 నో బాల్స్ కలిపి మొత్తం 14 రన్స్ సమర్పించుకున్నాడు. రెండో ఓవర్లోనూ అర్ష్దీప్ 2 నో బాల్స్ వేయడంతో… లంక బ్యాటర్లు 18 రన్స్ పిండుకున్నారు. దాంతో ఫ్యాన్స్ అర్ష్దీప్పై మండిపడుతున్నారు. వికెట్లు తీయడంలో కాదు… నో బాల్స్ వేయడంలో హ్యాట్రిక్ సాధించావా? అని కొందరు… అరెరే, అర్ష్దీప్ బౌలింగ్ మర్చిపోయాడా? అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ మీద కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివమ్ 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 53 రన్స్ ఇస్తే… ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చేశాడు. బౌలర్లంతా మూకుమ్మడిగా ఇంత దారుణంగా బౌలింగ్ చేస్తే… బ్యాటర్లు ఎంత కొట్టినా ఏం ప్రయోజనం ఉంటుందని ఫైరవుతున్నారు. లంక బ్యాటర్లను 180 రన్స్ లోపు కట్టడి చేసి ఉంటే… భారత్ గెలిచి ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ మ్యాచ్లో పలు చెత్త రికార్డులు సృష్టించాడు… అర్ష్దీప్. టీ-20 క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. అలాగే టీ-20ల్లో ఒకే మ్యాచ్లో అత్యధిక నో బాల్స్ వేసిన తొలి భారత బౌలర్గా కూడా అర్ష్దీప్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఈ దారుణ ప్రదర్శనే అతనిపై ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం.