Kuppam: కుప్పం పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది. చంద్రబాబు సభలు, ర్యాలీలకు ఇంకా పోలీసుల నుంచి అనుమతి రాలేదు. బాబు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తన ప్రచార రథం తనకు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇక, బుధవారం స్థానిక డీఎస్పీపై చంద్రబాబు కోపంతో ఊగిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సైతం పోలీసులపై విరుచుకుపడ్డారు. పలుచోట్ల తోపులాట, ఘర్షణ జరిగాయి. అదంతా భద్రంగా వీడియో రికార్డ్ చేసిన పోలీసులు.. ఒక్కరోజు ఆగి కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. పలువురు టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం సంచలనంగా మారింది.
దాదాపు 50 మందికిపైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని పోలీసులు కేసులు నమోదు చేశారు.
టీడీపీ నేతలపై రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ లో 3 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. 307, 353 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
శాంతిపురంకు చెందిన టీడీపీ నేతలు.. రాజశేఖర్, నాని, బాబు, లార్డాస్, రాజులపై సెక్షన్ 290, 188, 341 కింద కేసులు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హత్యాయత్నం నమోదు చేశారు.
గొల్లపల్లి క్రాస్ కు దగ్గర జరిగిన ఘటనపై సెక్షన్లు 148, 147, 332, 341, 353, 307r w, 149 కింద కేసులు నమోదు చేశారు. విశ్వనాథ నాయుడు, కేదామత్ ఆంజనేయరెడ్డి, నాగరాజు, ప్రవీణ్, జైపాల్, రమేష్, చంద్రకళ, అనసూయ, సుగుణ తదితరులపై పోలీసు విధులకు ఆటంకం కలిగించి.. సీఐ తులసీరాం, కానిస్టేబుల్ వినోద్ పై దాడి చేశారని కేసులో పొందుపరిచారు.
ఇక పెద్దూరు గ్రామం దగ్గర ఎస్సై సుధాకర్ విధులకు ఆటంకం కలిగించారంటూ.. సెక్షన్లు 341, 353 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద మంజునాథ్, అరణ కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు.
కేసులు నమోదైన టీడీపీ నేతలందరిపై పక్కా వీడియో ఆధారాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.