Sankranti: సంక్రాంతి. ఆంధ్రుల పెద్ద పండుగ. భోగి మంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, పిండివంటలు, ఆటాపాటలు, బంధుమిత్రుల సందడితో.. సంక్రాంతి సంబురాలు తెలుగు నాట అంబరాన్ని అంటుతాయి. ఇక, గోదావరి జిల్లాల్లో అయితే సంక్రాంతి జోరు మామూలుగా ఉండదు. కోడిపందేలతో ఫుల్ కోలాహలం. అలాంటి సంక్రాంతి పండుగపై ఈసారి చిన్న కాంట్రవర్సీ వచ్చింది. ప్రతీఏడూ జనవరి 14నే సంక్రాంతి జరుపుకుంటాం. కానీ, ఈసారి 14 కాదు.. 15వ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలని సూచిస్తున్నారు పండితులు. ఎందుకంటే..
మకర సంక్రమణంపై ఆధారపడి సంక్రాంతి పండుగను నిర్ణయిస్తారు. జనవరి 14వ తేదీ (శనివారం) రాత్రి 8 గంటల 45 నిమిషాలకు సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే అదే రోజు మకర సంక్రాంతి ముహుర్తం వస్తోంది. రాత్రి వేళ మకర సంక్రమణం జరుగుతుండటంతో.. సంక్రాంతిని ఆ రోజు జరుపుకోవాలా? లేదంటే, మర్నాడు చేసుకోవాలా? అనే గందరగోళం నెలకొంది.
సంక్రాంతి రోజు మకర స్నానం చేసి, దానాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. పంచాంగం ప్రకారం.. సూర్యుని మకర సంక్రాంతి ముహూర్తం జనవరి 14 రాత్రి 8:45కు ఉంది. ఆ సమయంలో స్నానాలు ఆచరించి, దానాలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది.
అందుకే, జనవరి 15 (ఆదివారం) ఉదయం 7:15 నుంచి సాయంత్రం 5:46 వరకు సంక్రాంతి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఉదయతిథి ఉన్నప్పుడే మకర సంక్రాంతి స్నానం చేసి పండుగ చేసుకోవాలని సూచిస్తున్నారు. జనవరి 15, ఆదివారం ఉదయం 7:15 నుంచి రాత్రి 9:00 వరకు శుభ సమయం ఉంటుంది. సో, ఈ ఏడాది సంక్రాంతి 14న కాదు.. జనవరి 15న జరుపుకోవాలని అంటున్నారు.