Kamareddy: కామారెడ్డి రణరంగంగా మారింది. రైతుల ముట్టడితో కలెక్టరేట్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. వందల, వేలుగా రైతులు కదం తొక్కారు. కుటుంబ సభ్యులతో కలిసొచ్చి ఆందోళనకు దిగారు. వారి డిమాండల్లా ఒక్కటే. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోవడమే. తమ భూముల జోలికి రావొద్దని.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ.. మా భూములు వదులుకునే ప్రసక్తే లేదంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం ధర్నాకు మద్దతుగా నిలిచారు.
కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. పోలీసులు బారికేడ్లతో రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇనుప కంచెలు రోడ్డుకు అడ్డంగా పెట్టారు. హలం పట్టి.. పొలం దున్నే.. రైతన్నలను ఆ ఇనుప బారికేడ్లు, ముళ్ల కంచెలు అడ్డుకోలేక పోయాయి. ఆగ్రహంతో వాటిని ఎత్తిపడేశారు రైతులు. పోలీసులతో తోపులాటకు దిగారు. పరస్పర ఘర్షణలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. మరో రైతు గాయపడ్డారు.
కలెక్టరేట్ దగ్గర పెద్ద సంఖ్యలో రైతులు చేరడం.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. జిల్లా కలెక్టర్ స్పందించారు. ఐదుగురు రైతులను చర్చలకు ఆహ్వానించారు. అయితే, కలెక్టరే తమ దగ్గరికి రావాలంటూ రైతులు పట్టుబట్టారు.
కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలసుకొని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ కేవలం ముసాయిదా మాత్రమే ఇచ్చారని తెలిపారు. ప్రజల కోణంలోనే దీనిపై తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. అభ్యంతరాలుంటే ముసాయిదాలో మార్పులు చేస్తామని.. రైతుల వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు వివరించాలని సంబంధిత అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
‘‘500 ఎకరాలు ఇండస్ట్రీయల్ జోన్కు పోతోందని ఆందోళన చేస్తున్నారు. భూమి పోతుందని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికల్లో చూశాను. ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెట్టదు. నిర్మాణాత్మక నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్. ఇది ప్రజలకు అనుకూలంగా ఉండాలి.. వ్యతిరేకంగా ఉండొద్దు’’ అని కేటీఆర్ అన్నారు.