Pant’s move to Mumbai. If necessary also to UK… :రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషబ్ పంత్ను… మరింత మెరుగైన వైద్యం కోసం ముంబై తరలించినట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పింది. పంత్ నుదుటికి డెహ్రాడూన్ ఆస్పత్రిలో స్వల్ప ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ముంబైలో బీసీసీఐ వైద్య బృందం సమక్షంలో పంత్ కుడి కాలు లిగ్మెంట్కు శస్త్రచికిత్స నిర్వహిస్తారు. బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే అతణ్ని యూకేకు పంపే అంశంపైనా బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు పంత్ త్వరగా కోలుకుని తిరిగి తన ఆట కొనసాగించాలని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆకాంక్షించాడు. జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి, వాటిని ఎదుర్కొని నువ్వు ముందుకు సాగాలంటూ పంత్కు సందేశం పంపాడు.. గంగూలీ. ఇక పంత్ సహచరుడు ఇషాన్ కిషన్ కూడా ప్రమాదంపై స్పందించాడు. ప్రమాద విషయం తెలిసే సమయానికి తాను రంజీ మ్యాచ్ ఆడుతున్నానని, విరామ సమయంలో ఆటోగ్రాఫ్స్, సెల్ఫీల కోసం వచ్చిన అభిమానులు పంత్ ప్రమాదానికి గురయ్యాడని తనకు చెప్పారని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. మొదట్లో తనకు కచ్చితమైన సమాచారం లేక అదో సాధారణ ప్రమాదం మాత్రమేనని అనుకున్నానని… కానీ ఆ తర్వాత పంత్కు చాలా సీరియస్గా ఉందని తెలిసి తీవ్ర ఆందోళన చెందానని ఇషాన్ చెప్పాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నంత సేపూ తన గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మాటల్లో చెప్పలేనని… అతడికి అంతా మంచే జరగాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని ఇషాన్ తెలిపాడు. రిషబ్ ఓ ఫైటర్ అని తనకు తెలుసని… ఆ అద్భుత ఆటగాడు జట్టు కోసం మైదానంలో ఎంతగా పోరాడాడో మనం చూశామని… పంత్ అతి త్వరలోనే తిరిగి వస్తాడని ఇషాన్ కిషన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.