Congress: తెలంగాణ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపుల నుంచి పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. లెఫ్ట్ అయ్యే ముందు ఇన్నాళ్లూ తనకు సహకరించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. మాణిక్కం తన పదవికి రాజీనామా చేశారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొత్త ఇంచార్జిని నియమిస్తారని టాక్. ఆయనే తన పదవి నుంచి వైదొలిగారా? లేదంటే, అధిష్టానమే తప్పించిందా? అనే దానిపై క్లారిటీ లేదు.
దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన నివేదిక మేరకే టి.కాంగ్ బాధ్యతల నుంచి మాణిక్కంను తప్పించారని ఓ వర్గం అంటోంది. రేవంత్ రెడ్డితో ఠాగూర్ కుమ్మక్కు అయ్యారని, అధిష్టానానికి సీనియర్లు అనేకమార్లు ఫిర్యాదు చేశారని.. దిగ్విజయ్ సింగ్ సైతం ఆయన్ను తప్పించాలని సూచించడంతో వేటు పడిందని కొందరు చెబుతున్నారు.
అయితే, మరో వాదన మరింత బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని పలువురు సీనియర్లు కొంతకాలంగా మాణిక్కం ఠాగూర్ పై ఒత్తిడి తెస్తున్నారట. అయితే, బీఆర్ఎస్ తో పొత్తుకు రేవంత్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. మాణిక్కం సైతం బీఆర్ఎస్ తో జట్టు కట్టేందుకు ఇష్టపడలేదని అంటున్నారు. అయినా, సీనియర్లు పదే పదే బీఆర్ఎస్ విషయం ప్రస్తావిస్తుండటంతో.. ఇక టి.కాంగ్ వ్యవహారాలు చూసుకోవడం తనవల్ల కాదంటూ అధిష్టానానికి చెప్పేశారట మాణిక్కం ఠాగూర్.
కొన్ని వారాల క్రితం రాజస్థాన్ లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని కలిసి.. సీనియర్ల ప్రతిపాదన, రేవంత్, తన అభిప్రాయాన్ని ఆయనకు విన్నవించారని చెబుతున్నారు. రాహుల్ గాంధీ సైతం కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసేందుకే సై అన్నారని అంటున్నారు. ఈ విషయం తెలిసే.. సీనియర్లు తిరుగుబాటు జెండా ఎగరవేశారని తెలుస్తోంది. ఇక సీనియర్లతో తాను డీల్ చేయలేనని భావించిన మాణిక్కం ఠాగూర్ స్వచ్చందంగా పార్టీ ఇంఛార్జ్ గా తప్పుకున్నారని అంటున్నారు.
ఇక, ఠాగూర్ రాజీనామాతో ఆయన స్థానంలోకి కొత్త ఇన్ చార్జ్ గా ఎవరు రాబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. ఈ ప్లీనరీ తర్వాత కొత్త ఇన్ చార్జ్ తో పాటు పార్టీ కమిటీల్లో మార్పులు చేర్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఏది ఏమైనా.. మాణిక్కం ఠాగూర్ పై చాలాకాలంగా గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు మాదే అప్పర్ హ్యాండ్ అయిందంటూ ఫుల్ ఖుషీగా ఉండి ఉంటారు. ఇదే జోష్ తో మరింత రెచ్చిపోతారా? కలిసిపోతారా?