BRS: పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం మాజీ ఎంపీ. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ముందుముందు ఉండకపోవచ్చు. ఈ మాట ఆయనే చెప్పారు. న్యూ ఇయర్ రోజున.. తన అనుచరులతో సమావేశమై.. తన రాజకీయ భవిష్యత్తుపై లీకులిచ్చారు. తాను, తనతో పాటు మరో నలుగురు ఐదుగురు ఖమ్మంలో పలు స్థానాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ను వీడుతానని పరోక్షంగా తేల్చేశారు.
ఎప్పటినుంచో పొంగులేటి అసహనంగా ఉన్నారు. బీఆర్ఎస్ లో ఆయన ప్రాధాన్యం మరీ తీసికట్టుగా మారింది. పార్టీలో ఉన్నా లేనట్టే. అసలే ఆర్థికంగా బలమైన నాయకుడు, అంగబలం కూడా ఎక్కువ. అలాంటి వాళ్లను ఊరికే కూర్చోబెడితే ఊరుకుంటారా? తమ దారేదో తాము చూసుకోరు? ఇప్పుడు అదే జరుగుతోంది. ఖమ్మంలో మంత్రి అజయ్ దే హవా నడుస్తుండటంతో.. పొంగులేటి పార్టీలో పొసగలేకపోతున్నారని అంటున్నారు.
జనవరి 1న ఆత్మయ సమావేశం పెట్టి.. పార్టీపై ధిక్కార ప్రకటన చేయడం గులాబీ బాస్ కు ఆగ్రహం తెప్పించింది. ఇంకేం, యాక్షన్ మొదలుపెట్టేశారు. పొంగులేటికి ప్రభుత్వ సెక్యూరిటీ తగ్గించేశారు. 3+3 సెక్యూరిటీని 2+2కి కుదించారు. ఎస్కార్ట్ వాహనం కూడా తొలగించారు. ఇలా పొమ్మనలేక పొగబెట్టారు. మరి, పొంగులేటి పోతారా?
అయితే బీజేపీలోకి వెళ్లాలి.. లేదంటే కాంగ్రెస్ లో చేరారి. బీఆర్ఎస్ ను వీడే నేతల ముందుండే ఆప్షన్లు ఈ రెండే. అంగబలం, అర్థబలం అధికంగా ఉన్న పొంగులేటి లాంటి బలమైన నేత వస్తానంటే.. ఏ పార్టీ కూడా వద్దనే పరిస్థితి ఉండదు. రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతాయి పార్టీలు. అసలే ఖమ్మం. ఆ జిల్లాలో బీజేపీకి ఉనికి ఏమాత్రం లేదు. కాంగ్రెస్ కాస్త బలంగానే ఉంది. పొంగులేటితో కమలనాథులు ఎప్పటి నుంచో టచ్ లో ఉన్నారని అంటున్నారు. స్వతహాగా వ్యాపారవేత్త కావడంతో బీజేపీలోకి వెళితేనే సెక్యూరిటీ కూడా ఉంటుంది. కొంతకాలంగా కాషాయం పార్టీ పెద్దలతో పొంగులేటి సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్.
మరో ఆసక్తికర టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో ఆయన వైసీపీ తరఫున ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అయితే, ఇటీవల బీఆర్ఎస్ గా మారి ఏపీలోనూ కేసీఆర్ అడుగుపెట్టడంతో.. వైసీపీ సైతం తెలంగాణలో తమ ప్రాతినిధ్యం ఉంటే బెటర్ అనే భావనతో ఉందట. కొన్ని నెలల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి మరీ సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఆ మీటింగ్ గురించి అప్పట్లో మీడియాలో ప్రముఖంగా కవరేజ్ కూడా వచ్చింది. ఆ విషయం ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తోంది. పొంగులేటి ఏ బీజేపీలోకో, కాంగ్రెస్ లోకో వెళ్లరని.. మళ్లీ వైసీపీలోనే చేరుతారని అంటున్నారు. పార్టీతో సంబంధం లేకుండా.. సొంత బలంతో గెలిచే సత్తా ఉన్న నేత కావడంతో.. వైసీపీలో చేరినా ఆయనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు.
గతంలో జగన్ ను పొంగులేటి కలిసినప్పుడు.. తనకు తెలంగాణ రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదన్నట్టు చెప్పారట. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారడం బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడంతో.. తెలంగాణలోనూ వైసీపీ జెండా ఎగిరితే తప్పేంటనేది జగన్ భావనగా తెలుస్తోంది. అందుకే, పొంగులేటి రీఎంట్రీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు.
మరోవైపు, ఖమ్మంలో తనతో పాటు మరో నలుగురైదుగురు పోటీ చేస్తారని ప్రకటించి.. వైసీపీలో చేరే అంశంపై క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. బీజేపీనో, కాంగ్రేసో అయితే ఆయన వర్గానికి ఒకే జిల్లా నుంచి అన్నేసి సీట్లు ఇచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు. పొంగులేటికి మాత్రమే టికెట్ ఇవ్వొచ్చు. కానీ, వైసీపీ విషయంలో అలా కాదు. తెలంగాణలో వైసీపీ తరఫున పోటీ చేయడమే ఎక్కువ. అందుకే, పొంగులేటి వర్గం ఎన్నంటే అన్ని టికెట్లు ఇవ్వడం ఖాయం. ఆ నమ్మకంతోనే పొంగులేటి తాను, తన అనుచరుల పోటీపై అంత ధీమాగా ప్రకటన చేశారని చెబుతున్నారు. జగన్ నుంచి అనుమతి వచ్చాకే.. ఆత్మీయ సమావేశం పెట్టి.. బీఆర్ఎస్ పై రెబెల్ జెండా ఎగరేశారని అంటున్నారు. అదే నిజమైతే.. తెలంగాణలోనూ వైసీపీ జెండా ఎగరనుందా?