Congress: కాంగ్రెస్ అధిష్టానం నిర్దేశించిన ప్రోగ్రామ్. హైదరాబాద్ లో హాత్ సే హాత్ జోడో అభియాన్ శిక్షణా కార్యక్రమం. సీనియర్లంతా హాజరుకావాల్సి ఉంది. కానీ, తిరుగుబాటు సీనియర్లు రాలేదు. కాస్త పెద్దరికం ప్రదర్శించి సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాత్రం వచ్చారు. మరో సీనియర్ కోదండరాంరెడ్డి కూడా విచ్చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి.. తదితరులు డుమ్మా కొట్టారు. రేవంత్ రెడ్డికి మరోసారి ఝలక్ ఇచ్చారు.
ఇలాంటిదేదో జరుగుతుందని అధిష్టానం ముందే ఊహించింది. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మంగళవారమే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు. మీటింగ్ కు వెళ్లాలని సూచించారు. అయినా, ఉత్తమ్ రాలేదు. ఖర్గే చెప్పినా కూడా డోంట్ కేర్ అన్నారు. తనకు డిఫెన్స్ కమిటీ మీటింగ్ ఉందంటూ ఉత్తమ్ ఆబ్సెంట్ అయ్యారు. మరో సీనియర్ శ్రీధర్బాబు కర్ణాటక పీసీసీ మీటింగ్కు వెళ్లారట. ఇక, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తనకు అసలు పిలుపే రాలేదన్నారు. ఇలా తలా ఒక కారణం చెబుతూ.. మీటింగ్ కు డుమ్మా కొట్టారు.
మారరా? సీనియర్లు ఇక మారరా? కమిటీల కూర్పుపైనేగా వారి అభ్యంతరం? రేవంత్ రెడ్డి మీద కాదుగా? కాంగ్రెస్ పార్టీ మీద కాదుగా? మరెందుకు ఇలా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ కాంగ్రెస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు? అంతర్గత సమస్యలు పరిష్కరించడానికి ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చి.. అందరి అభిప్రాయాలు విని.. నివేదిక రెడీ చేశారుగా. ఆ రిపోర్ట్ పరిశీలించి సమస్యలను సాల్వ్ చేయడానికి హైకమాండ్ ప్రయత్నిస్తుండగా.. ఇంతలోనే సీనియర్లు మళ్లీ ఇలా మొండికేయడం ఏంటి? అంటూ రేవంత్ రెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది. ఖర్గే చెప్పినా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడం సరికాదంటోంది.
బుధవారం నాటి శిక్షణా కార్యక్రమం ఏ రేవంత్ రెడ్డి కోసమో, సీతక్క కోసమో కాదు. పార్టీ కోసం. అధిష్టానం నిర్దేశించిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమం కోసం. మరి, ఇలాంటి కీలక సమావేశానికి సీనియర్లంతా తరలివచ్చి.. కేడర్ కు దిశానిర్దేశం చేయాల్సి ఉండగా.. వాళ్లలో వాళ్లే కుమ్ములాడుకుంటూ.. మీటింగులకు డుమ్మాలు కొడుతూ.. దిగువ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అని సగటు కాంగ్రెస్ అభిమాని ఆవేదన చెందుతున్నాడు. రేవంత్ రెడ్డితో ఇగో ప్రాబ్లమ్స్ ఉంటే.. మీరు మీరు గాంధీభవన్ లోనే, ఢిల్లీ వార్ రూమ్ లోనో తేల్చుకోవాలి కానీ, ఇలా కుమ్ములాటలతో ప్రజల ముందు పార్టీని చులకన చేయొద్దని అంటున్నారు.