Adanis bumper offer to those who sold shares: ఏదైనా కంపెనీలో షేర్లు ఉన్నవాళ్లు వాటిని అమ్మాలనుకుంటే… అమ్మే సమయానికి ఉన్న ధర మాత్రమే వస్తుంది. కానీ… ఆఫర్ ఫర్ సేల్లో షేర్లు అమ్మిన ఎన్డీటీవీ వాటాదార్లకు మాత్రం… బంపరాఫర్ తగిలింది. వారికి ఒక్కో షేరుకు అదనంగా రూ.48.65 చొప్పున ఇవ్వనున్నట్లు, ఆ షేర్లు కొన్న గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు ప్రకటించింది.
ఎన్డీటీవీ వ్యవస్థాపకులైన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ నుంచి వాటాల కొనుగోలు కోసం ఒక్కో షేరుకు రూ.342.65 చెల్లించింది… అదానీ గ్రూప్. అంతకుముందు 2022 నవంబరు 22 నుంచి డిసెంబరు 5 మధ్య జరిగిన ఓపెన్ ఆఫర్లో షేర్లు అమ్మిన ఎన్డీటీవీ వాటాదార్లకు, ఒక్కో షేరుకు రూ.294 చొప్పున మాత్రమే చెల్లించింది. దాంతో భవిష్యత్తులో ఇబ్బందులేమైనా ఎదురవుతాయనే ఉద్దేశంతో… సాధారణ వాటాదార్లకు కూడా ప్రణయ్, రాధికాలకు చెల్లించినట్లే రూ.342.65 ఇవ్వాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. అందుకే గతంలో ఇచ్చిన రూ.294కు అదనంగా ఒక్కో షేరుకు రూ.48.65 చొప్పున చెల్లించబోతోంది. అలా ఇస్తే… ఒక్కో షేరుకు మొత్తం రూ.342.65 ఇచ్చినట్లు అవుతుంది.
ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ నెలకొల్పిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్కు… విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.403 కోట్ల వడ్డీ లేని రుణమిచ్చింది. దాన్ని కొనడం ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను దక్కించుకుంది… అదానీ గ్రూపు. ఆ తర్వాత ఓపెన్ ఆఫర్ ప్రక్రియ ద్వారా మరో 26 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ రెండు లావాదేవీలతో ఎన్డీటీవీలో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ కన్నా ఎక్కువగా అదానీ గ్రూపే అధిక వాటాను పొందింది. గతవారం వాళ్లిద్దరికీ ఉన్న 32.26 శాతం వాటాలో… 27.76 శాతం వాటాను కూడా అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. దీని కోసం ఒక్కో షేరుకు రూ.342.65 చెల్లించింది. దాంతో రాయ్ దంపతులకు రూ.602 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ 64.71 శాతం వాటా కలిగి ఉండగా… రాయ్ కపుల్ చెరో 2.5 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు.