Kuppam : టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా రాష్ట్రంలో రోడ్లపై ర్యాలీలు, సభలను ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందనే టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బాబు పర్యటన కోసం చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు.. బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం వెళ్లతారు. శాంతిపురం మండలం పెద్దూరు, శివకురుబూరు గ్రామాల్లో నిర్వహించనున్న ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొంటారు. కేనుమాకురిపల్లిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు.
మరోవైపు చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురం మండలానికి వెళ్లాల్సిన టీడీపీ ప్రచార రథాన్ని, ఇతర వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటించే మార్గాల్లో పోలీసులను భారీగా మోహరించారు. అయితే కొన్నిచోట్ల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో బారీకేడ్లు పెట్టి కార్యకర్తలను నిలువరిస్తున్నారు తెలుస్తోంది.
కేనుమాకురిపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసుల చెప్పడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తొలుత అనుమతి ఇచ్చి తర్వాత లేదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. శాంతిపురంలో వందలాది మంది పోలీసులు మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు జనం రాకుండా చేసేందుకు పోలీసులు భయాందోళన కలిగించేలా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అటు చిత్తూరు జిల్లా పలమనేరులో ఉద్రిక్తత ఏర్పడింది. కుప్పం వెళ్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ప్రచార రథాన్ని అనుమతించలేదు. దీంతో రోడ్డుపైనే టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.
మరోవైపు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎస్.గొల్లపల్లిలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇక్కడే ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు వస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు శాంతిపురం చేరుకుంటున్నారు. చంద్రబాబు పర్యటన మార్గాల్లో బారీకేడ్లు పెట్టి కార్యకర్తలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్.గొల్లపల్లి వద్ద పోలీసులు-టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో మహిళా కార్యకర్తలతో పాటు 10 మందికి గాయాలయ్యాయి. టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు స్పృహ తప్పి కిందపడియారు.