CM Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యేందుకు.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మన్కీ బాత్ ప్రోగ్రామ్ ఎలాగైతే నడుస్తోందో అదే తరహాలో “ఉంగిళిల్ ఒరువన్ బదిల్గళ్” (మీలో ఒకడిగా సమాధానాలు) అనే ధారావాహిక ప్రోగ్రామ్ను మొదలు పెట్టారు. ప్రజల్లో ఒకడిగా ఉండి ప్రజలకే సమాధానం చెప్పే ఉద్దేశ్యంతో సీఎం స్టాలిన్ ఈ ప్రొగ్రామ్ను స్టార్ట్ చేశారు.
ఈ కొత్త ధారావాహిక ప్రోగ్రామ్ ఆదివారం ప్రారంభమైంది. సామాన్యులు సోషల్ మీడియాలో తరచూ అడిగే ప్రశ్నలకు సీఎం స్టాలిన్ సమాధానమిచ్చారు. డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైనందుకు ఏమైనా కొత్త వ్యూహం రచించారా అని ప్రశ్నకు… అన్నదురై, కలైజ్క్షర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి ద్రవిడ మోడల్ను కొనసాగించాలన్నారు. దేశంలో డీఎంకే పార్టీ అన్ని పార్టీలకు స్పీర్తిగా ఆదర్శప్రాయంగా నిలవాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీపైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ పరిధులు ఏమిటో రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయన్నారు స్టాలిన్. కానీ గవర్నర్తో ద్వంద పాలన చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని బట్టి నడుచుకుంటే ఏ సమస్యా ఉండదన్నారు. కేంద్రం సహకరిస్తే మరిన్ని మంచి పథకాలను అమలుచేస్తామన్నారు. బీజేపీతో డీఎంకే రాజీపడిందా అనే ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చారు సీఎం స్టాలిన్. రాజీ పడటానికి ముందుగా బీజేపీనే అంగికరించదని అన్నారు.