ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో చాలా మంది ఆఖరి రోజు దాకా రిటర్న్స్ దాఖలు చేయకుండా… చివరి నిమిషాల్లో హైరానా పడుతుంటారు. మరికొందరు గడువు ఎప్పటిదాకా ఉందో కూడా అర్థంకాక తికమకపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లంతా రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ముఖ్యమైన తేదీలు ఏవో తెలుసుకుంటే… టెన్షన్ లేకుండా ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఓసారి చూద్దాం…
రిటర్న్స్ ఫైల్ చేశాక తప్పనిసరిగా ధ్రువీకరించాలి. కేంద్ర ప్రత్యక్ష పన్ను విభాగం… ఐటీఆర్ ధ్రువీకరణ సమయాన్ని 2022 ఆగస్ట్ 1 నుంచి 30 రోజులకు తగ్గించింది. అసెస్మెంట్ ఇయర్ 2022-23 కోసం… ఆలస్యంగా, అంటే 2022 డిసెంబరు 31 లోగా ఐటీఆర్ లేదా సవరించిన ఐటీఆర్ దాఖలు చేసినవాళ్లు… 2023 జనవరి 30లోపు దాన్ని ధ్రువీకరించాలి. లేకపోతే ఐటీఆర్ దాఖలు చేసినా ప్రయోజనం ఉండదు.
ఇక అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే వారికి మార్చి 15 ముఖ్యమైన తేదీ. 2022-23లో అడ్వాన్స్ ట్యాక్స్ చివరి వాయిదా చెల్లించేందుకు ఇదే ఆఖరు తేదీ. ఇక పాత పన్ను విధానంలో రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే.. పన్ను ఆదా పెట్టుబడులను పూర్తిచేసేందుకు చివరి తేదీ మార్చి 31. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వివిధ మార్గాల ద్వారా మార్చి 31 లోపు పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందొచ్చు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి వాయిదా చెల్లించేందుకు జూన్ 15 చివరి తేదీ. ఎవరైనా ఉద్యోగి 2022-23 ఆర్థిక సంవత్సరంలో యజమాని నుంచి ఫామ్-16 స్వీకరించేందకు కూడా ఇదే చివరి తేదీ. ఇక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31. చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఈ గడువును పొడిగిస్తూ ఉంటుంది కూడా.
2023-24 ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ ట్యాక్స్ రెండో వాయిదా చెల్లించేందుకు చివరి తేదీ సెప్టెంబరు 15 కాగా… మూడో వాయిదా చెల్లించేందుకు చివరి తేదీ డిసెంబర్ 15. ఇక ఆలస్యపు లేదా సవరించిన ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31.