ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వడ్డీ రేటును 7.1 శాతానికి పెంచింది… కేంద్రం. గత త్రైమాసికంలో ఈ వడ్డీ రేటు 6.6 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు వడ్డీ రేటు అర శాతం పెరగడంతో… కొత్తగా పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టేవారికి ఎంత ఆదాయం వస్తుందో చూద్దాం…
తాజా వడ్డీ రేటు ప్రకారం పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్లు… నెలకు రూ.591.67 రూపాయల ఆదాయం పొందొచ్చు. అంటే రూ.10 లక్షల మదుపు చేస్తే… నెల నెలా రూ.5,916 రూపాయలు అందుకోవచ్చు. పెట్టుబడికి భద్రత కల్పిస్తూ.. స్థిరమైన నెలవారీ ఆదాయం కోసం చూసే వారికి పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మంచి ఎంపిక.
పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వ్యక్తిగతంగా కనీసం రూ.1000 నుంచి రూ.4.50 లక్షల వరకు… జాయింటుగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 ఏళ్లు నిండిన మైనర్ల పేరు మీద కూడా ఈ పథకంలో రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతా మేజర్ ఖాతాగా మారుతుంది.
ఒక వ్యక్తి ఖాతాలో గరిష్ఠ పరిమితి వరకు, అంటే రూ. 4.50 లక్షల వరకు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం నెల నెలా రూ.2,662 పొందొచ్చు. అంటే, ఐదేళ్లలో వడ్డీ రూపంలో రూ.1,59,720 ఆదాయం వస్తుంది. ఒకవేళ జాయింట్ ఖాతాలో గరిష్ఠ పరిమితి అయిన రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే… నెల నెలా వడ్డీ రూపంలో రూ.5,324 ఆదాయం పొందొచ్చు. అంటే ఐదేళ్లలో వడ్డీ రూపంలో రూ.3,19,440 ఆదాయం లభిస్తుంది.
ఈ స్కీమ్లో ఐదేళ్ల లాక్-ఇన్-పీరియడ్ ఉంటుంది. ఐదేళ్లు పూర్తయ్యాక మళ్లీ పెట్టుబడి కొనసాగించవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులతో జాయింటుగా లేదా మైనర్ పేరు మీద తెరవొచ్చు. ఒకే ఖాతా తెరవాలనే నిబంధన లేదు కానీ, ఒక ఖాతాలో ఎంత వరకు జమ చేయవచ్చనే దానిపై పరిమితి ఉంది. ఇక ముందస్తు విత్డ్రాలకు కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత ముందస్తు విత్డ్రాలను అనుమతిస్తారు. ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధిలో విత్డ్రా చేస్తే 2 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లకు ముందే విత్డ్రా చేస్తే 1 శాతం రుసుము చెల్లించాలి. ఇక ఈ ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి దేశంలోని ఏ పోస్టాఫీసుకైనా బదిలీ చేసుకోవచ్చు.