Anam: ఈమధ్య వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. ఆనంను వెంకటగిరి ఇంఛార్జి పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం సీఎం జగన్ ను రాంకుమార్ కలవగా.. సాయంత్రానికల్లా ఆయన్ను పార్టీ ఇంఛార్జ్ గా నియమించారు. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకు.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆనం ప్రాధాన్యతను తగ్గించడం కోసమే పార్టీ బాధ్యతలను నేదురుమల్లికి అప్పగించారు.
ఆనం మాత్రం తన కాంట్రవర్సీ కామెంట్లను ఆపేడం లేదు. లేటెస్ట్ గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అవే వస్తే తామంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయమంటూ మరింత కలకలం రేపారు.
సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు జరిగా జరగడం లేదని విమర్శించారు. ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది.. ఇంకా సచివాలయాల నిర్మాణం పూర్తి కాకపోవడనికి సాంకేతిక కారణాలా? బిల్లుల చెల్లింపు జాప్యమా? తెలీడం లేదంటూ పబ్లిక్ గా కామెంట్లు చేశారు ఎమ్మెల్యే ఆనం.
ఆనం వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆనం జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారేమో.. లేదంటే కలగని ఉంటారేమోనని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ చెప్పినట్టే 2024లోనే ఎన్నికలు వస్తాయని, వైసీపీ మళ్లీ గెలుస్తుందని, టీడీపీ మూతపడుతుందని అన్నారు. రోజుకో పార్టీ మారేవాళ్ల గురించి తాను మాట్లాడబోనని మండిపడ్డారు అనిల్.
ఇటీవల వైసీపీపై ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పనులు చేయడం లేదని, అధికారులు మాట వినడం లేదని.. ఈసారి వైసీపీకి ప్రజలు ఓట్లు వేయరని.. తామంతా ఓడిపోతామంటూ.. ఇలా పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లూ సీనియర్ లీడర్ అని ఓపికగా ఉన్న అధిష్టానం.. తాజాగా వెంకటగిరి ఇంచార్జిగా ఉన్న ఆనంపై వేటు వేసింది.
మరీ ఈస్థాయిలో కాకపోయినా.. ఇటీవల ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని సీఎం జగన్ తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడి ఆయనను కూల్ చేసి పంపించారు. కానీ, సీనియర్ ఎమ్మెల్యే ఆనం మాటలు మరీ డ్యామేజింగ్ గా ఉండటంతో.. నేరుగా ఆయనపై యాక్షన్ చేపట్టారు అధినేత జగన్. ఆనం వైసీపీని వీడి.. టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీ వీడేముందు కావాలనే ఇలా వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఆ విషయం తెలిసే.. పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి ఆనంను తొలగించింది వైసీపీ అధిష్టానం.