Bandi Sanjay: ఏపీ బీఆర్ఎస్ కు తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా ప్రకటించి ఆంధ్రాలో పార్టీ ప్రస్థానం ప్రారంభించారు కేసీఆర్. విశాఖ ఉక్కును అమ్మనీయబోమని అన్నారు. ఏపీ సంగతి సరే.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీల మాటేంటి? అంటూ నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు లేకుండానే.. ఏపీకి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మరి, బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడు ఎవరంటూ ప్రశ్నించారు బండి సంజయ్.
ఇక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్లను నమ్మించి ఓట్లు వేయించుకోవాలనేది సీఎం కేసీఆర్ ఎత్తుగడ అని.. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో మళ్లీ ఏపీ, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడతారని మండిపడ్డారు. గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్ అవమానించలేదా? అంటూ పాత విషయాలు గుర్తు చేశారు.
విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయనీయమని అంటున్న కేసీఆర్.. తెలంగాణలో నిజాం చక్కెర పరిశ్రమను ఎందుకు పునరుద్ధరించటం లేదని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ వైఖరి ఏంటి? పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తానన్న కేసీఆర్.. మరి, తెలంగాణలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? అని నిలదీశారు.
రాష్ట్రంలో విద్యుత్ఛార్జీలు పెంచింది నిజం కాదా?
కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది నిజం కాదా?
ఏపీ సీఎంతో కుమ్మక్కై కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం నిజం కాదా? అంటూ బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు 18 లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే..రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 లక్షల బోర్ అయ్యాయన్నారు.
పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉందని.. నిరుద్యోగంలో తెలంగాణ 4వ స్థానంలో ఉందని.. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందని.. ముందు రాష్ట్ర సంగతి చూడాలని ఆ తర్వాత దేశం గురించి ఆలోచించవచ్చంటూ కేసీఆర్ కు కౌంటర్ వేశారు. యువతను బీజేపీకి దూరం చేసేందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.