USA: అమెరికాకు వెళ్లారు. మంచి మంచి జాబులు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్నారు. అంతదూరం వెళ్లినా.. అంతెత్తుకు ఎదిగినా.. కనీస బుద్ధి, జ్ఞానం ఉండనక్కరలేదా? ఏందిది? ఆ గొడవేంటి? ఆ కుమ్ములాటలేంటి? అమెరికాలోనూ ఆ కుల పిచ్చి.. ఆ వర్గ పోరు ఏంటి? పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేంతగా అలా పోట్లాడుకోవడమేంటి? అంటూ డల్లాస్ ఘటనపై తెలుగు వారంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏ దేశమేగినా.. ఈ సంకుల సమరం ఏంటి? ఛీ.. అంటున్నారు.
ఒకరు జై బాలయ్య. మరొకరు జై పవన్, జై చిరంజీవి. ఒకరు వీరసింహారెడ్డి. ఇంకొకరు వాల్తేరు వీరయ్య. కొందరు బాలయ్య పాటలే పాడాలన్నారు. మరికొందరేమో పవన్ కల్యాణ్ సాంగ్సే ప్లే చేయాలని పట్టుబట్టారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాటలపైనా పోటీనే. ఆ గొడవ అలా అలా ముదిరి.. అగ్రహీరోల ఫ్లెక్సీలు తగలబెట్టుకునే వరకూ వెళ్లింది. పరస్పరం గల్లాలు పట్టుకొని.. కొట్టుకున్నారు. డల్లాస్ లో కొత్త సంవత్సర వేడుకలను రచ్చ రచ్చగా మార్చేశారు. కట్ చేస్తే, మొత్తం గొడవకు మూలకారణమైన బాలయ్య అభిమాని, టీడీపీ ఎన్నారై సెల్ కీలక నేత కేసీ చేకూరిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ రచ్చ.. ఆ కొట్లాట.. ఆ విజువల్స్ చూస్తుంటే.. ఇదా అమెరికాలో మనవాళ్లు చేస్తున్నది అంటూ ఈసడించుకుంటున్నారు సగటు తెలుగువారు. అభిమానం పేరుతో ఇంకా ఇలా గొడవలు పడటం సిగ్గు చేటు అంటున్నారు. కమ్మ వర్సెస్ కాపు.. టీడీపీ వర్సెస్ జనసేన.. బాలయ్య వర్సెస్ మెగా కుటుంబం.. ఇలా రెండు వర్గాలుగా చీలి.. చెండాలం చేసి.. ప్రజలతో చీదరించుకుంటున్నారు. గతంలో ఈ గొడవ జరిగుంటే ఇంతటి వ్యతిరేకత వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో పరిస్థితులు బాగా మారిపోయాయి. నందమూరి, కొణిదెల కుటుంబాల మధ్య స్నేహం వెల్లివిరిసింది. అన్ స్టాపబుల్ తో బాలయ్య.. అల్లు కుటుంబ ఒక్కటైపోయింది. ఏకంగా పవన్ కల్యాణ్ తోనే బాలయ్య బాబు షో చేసేంత దగ్గర చేసింది. NBK, PSPK ల కాంబినేషన్ తెలుగునాట హాట్ టాపిక్ గా నడిచింది. ఇక, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎంత మంచి ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. ఇలా నందమూరి, కొణిదెల కుటుంబం ఒక్కటిగా మెదులుతుంటే.. మరి, అమెరికాలో వారి ఫ్యాన్స్ పేరుతో ఎన్నారైలు చేస్తున్నదేంటి? తమ హీరోలంతా కలిసిమెలిసి ఉంటే.. అభిమానులు మాత్రం ఇలా వారి పేరుతో తన్నుకు చావడం ఏంటి? అది కూడా అమెరికాలో.
జాగ్రత్తగా గమనిస్తే.. ఈ ఘటనలో హీరోలపై అభిమానం కంటే కుల పిచ్చి, పార్టీ పిచ్చే ఎక్కువగా కనిపిస్తోంది. హీరోలు కలిస్తే ఏం? తాము మాత్రం కలిసేది లేదంటూ కలహాలకు దిగుతున్నారు. టీడీపీ వర్గమంతా బాలయ్య పేరుతో.. జనసేన వర్గం పవన్ కోసం.. మధ్యలో రెడ్లు ఎంటరై జగన్ సాంగ్ కావాలంటూ మరింత మంట రాజేసి.. అంతా కలిసి డల్లాస్ లో రచ్చ రచ్చ చేయడంపై రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా మారండ్రా అని.. లేదంటే, వాళ్లనెవరికైనా చూపించండ్రా.. అని మండిపడుతున్నారు.