Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బీజీగా ఉన్నారు. ఈ పాదయాత్ర చేపట్టిన తర్వాత ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. అన్నివర్గాల నుంచి ఆదరణ పెరిగింది. సామాన్యులతో ఆయన మమేకమవుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త మరింత ఆసక్తిని పెంచింది. అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ రాహుల్ కు లేఖ రాశారు. రాముడి ఆశీస్సులు రాహుల్కు లభించాలని ఆకాంక్షించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు రాహుల్ చేపట్టిన యాత్ర ఫలవంతం కావాలన్నారు. ప్రజల సుఖం, సంతోషం కోసం ప్రయత్నిస్తున్న రాహుల్ కు రాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తన సందేశంలో సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు.
సత్యేంద్ర దాస్ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని అనుకున్నారని కాంగ్రెస్ పార్టీ అయోధ్య జిల్లా ప్రతినిధి సునీల్ కృష్ణ గౌతమ్ తెలిపారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో రావడంలేదన్నారు. ఆయన నైతిక మద్దతును లేఖ ద్వారా తెలిపారని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల విరామం తర్వాత భారత్ జోడో యాత్ర ఢిల్లీలో మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ యాత్ర 110 రోజులపాటు సాగింది. దేశవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్లు నడిచారు రాహుల్ గాంధీ.
సెప్టెంబర్ 7న కన్యాకుమారీలో మొదలైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్,మహారాష్ట్ర, హర్యానాలో సాగింది. జనవరి 26 శ్రీనగర్లో భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ముగించనున్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ యాత్రకు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దతు పలికారు.