KTR challenges Revanth: తమ పాలన సమయంలో ఫోన్ లను ట్యాపింగ్ చేశారన్న విమర్శలపై మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. హైదరాబాదులో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో కేటీఆర్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పాల్గొని, బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం కేటీఆర్ సైతం రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా విమర్శించారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోవడం వాస్తవమని, అయితే మధ్యతరగతి ప్రజలు, ఒకటి ముద్దు రెండు హద్దు అనే రీతిలో తమ సంతానానికి సంబంధించి ఏకాభిప్రాయంతో జీవితం కొనసాగిస్తున్నారన్నారు. దీనితో ఫ్యామిలీ ప్లానింగ్ అన్ని రాష్ట్రాలలో విజయం సాధించినట్లుగా చెప్పవచ్చన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఫోన్ల టాపింగ్ విషయంపై కేటీఆర్ మాట్లాడుతూ.. తమ పదేళ్ల పరిపాలన కాలంలో ట్యాపింగ్ ఊసే లేదని, కావాలనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఆరోపణలు చేస్తుందన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, అవసరమైనప్పుడల్లా ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ.. ప్రజల మదిలో తమ పార్టీపై చెడు అభిప్రాయం కలిగించేలా కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తుందన్నారు. ఇంతకు ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో తెలియాలంటే, తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లైడిటెక్టర్ టెస్టులు నిర్వహించాలని, అందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని కేటీఆర్ సవాల్ విసిరారు.
తమ పరిపాలన సమయంలో కేవలం ప్రజా సంక్షేమ పాలనకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని, తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో, తమ పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. ఇలా రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడడం, అలాగే ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడం సంచలనానికి దారితీసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న విషయం విదితమే.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులు కూడా అరెస్ట్ కాగా, ఇంకా విచారణ కూడా సాగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ మరోమారు తమ పాలనపై పడ్డ ట్యాపింగ్ మచ్చను చెరిపివేసేందుకు సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ప్రయత్నించారని చెప్పవచ్చు. మరి కేటీఆర్ కి చేసిన విమర్శలపై కాంగ్రెస్ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.