Telugudesham Party Member Ship : ఏపీలో అధికార పార్టీ సందడి చేస్తోంది. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం సభ్యత్వం నమోదుపై దృష్టి సారించింది.
ఉండవల్లిలో కీలక భేటీ…
ఈ క్రమంలోనే పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన భేటీలో కీలకమైన చర్చలు చేశారు. ఇందులో భాగంగానే రేపటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
రూ.100 రూపాయలతో పార్టీ సభ్యత్వం తీసుకుంటే, రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యాన్ని వర్తింపజేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. శనివారం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని స్వయంగా సీఎం ప్రారంభించనున్నారు.
త్వరలోనే సెకెండ్ లిస్ట్…
మరోవైపు ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పదవుల భర్తీపైనా చర్చించారు. రెండో దఫా పదవుల కేటాయింపుల కోసం ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు తుది కసరత్తులను పూర్తి చేశారు. వీలైనంత త్వరగానే రెండో జాబితాను ప్రకటించేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.
ఈసారి రెట్టింపు సంఖ్యలో…
తొలి జాబితాలో 21 నామినేటెడ్ పదవులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈసారి రెట్టింపు సంఖ్యతో జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కూటమి పార్టీలని మిగతా పార్టీలతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారట.
కష్టపడ్డ వారికే పదవులు మరి…
ప్రతిపక్షంలో ఉండగా, పార్టీల కోసం కష్టపడ్డ వారికే పదవులు అనే విధానాన్ని అమలు చేయనున్నారట. ఇందుకోసమే వివిధ మార్గాల ద్వారా పార్టీ నేతలపై వచ్చిన సమాచారాన్ని అధిష్టానం విశ్లేషిస్తోందట. దీంతో విస్తృత కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
also read : శారదాపీఠం.. పేరుకే పీఠమే కానీ వివాదాల పుట్ట.. ప్రభుత్వ నిర్ణయం భేష్ అంటున్న కూటమి నేతలు