– తీరం దాటిన దానా తుపాను
– ఆంధ్రాకు తప్పిన ముప్పు
– పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై తీవ్ర ప్రభావం
– రెండు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలు
– లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
– రైళ్లు, విమాన సర్వీసుల రద్దు
– మరో రెండు రోజులపాటు తుపాను ప్రభావం
విశాఖపట్నం, స్వేచ్ఛ:
రెండు రోజులుగా ఏపీ ప్రజలను భయాందోళనకు గురిచేసిన దానా తుఫాను ముప్పు తప్పినట్లే. ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం తుఫాను గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. తుఫాను బలహీన పడింది. అది క్రమంగా ఉత్తర కోస్తా ఒడిశా మీదగా 30 కిలోమీటర్ల వేగంతో వాయువ్యతీరంలో కేంద్రీకృతమైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటిన తర్వాత ఉత్తర ఒడిశా వద్ద వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అయితే దీని ప్రభావం వలన ఉత్తర ఆంధ్రా తీర ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానా తుఫాను ప్రభావంతో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
పలు రైళ్లు రద్దు
దానా తుఫాను తీరం దాటి ఒడిశా, పశ్చిమబెంగాల్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలకు భద్రక్, బాలోసోర్, జగత్సింగపూర్ లలో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. చాలా చోట్లు విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డుపైన పడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలనుంచి దాదాపు ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో ఈ రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లన్నీ దాదాపు రద్దయ్యాయి. ఇప్పటికే నాలుగు వందలకు పైగా రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. భువనేశ్వర్ లో భారీ వర్షాలు కురుస్తున్నందున, ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఇలానే కొనసాగుతుందని.. అత్యవసర ప్రయాణాలు ఉంటే తప్ప తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.