Shamshabad Airport Bomb Threat: ఇటీవల విమానాలకు వచ్చే బాంబు బెదిరింపు కాల్స్, భద్రతా సిబ్బందికి తలనొప్పులు తెస్తున్నాయనే చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా ఏదో ఒక విమానాశ్రయానికి బెదిరింపులు రావడం, అక్కడంతా తనిఖీ చేయడం, చివరికి ఫేక్ కాల్ అంటూ పోలీసులు నిర్ధారించడం పరిపాటిగా మారింది. కానీ ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది మాత్రం.. వచ్చే బెదిరింపు కాల్స్ ని ఒక్కొక్కటిగా గుర్తిస్తున్నా, వీటి తాకిడి మాత్రం తగ్గట్లేదు. దీనితో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది.
తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి సైతం బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాదు నుండి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు, ఆ బెదిరింపు కాల్ సారాంశం. ఇక అంతే సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది, విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. విమానం అణువణువు అధికారులు తనిఖీ చేస్తుండగా, ప్రయాణికులను క్రిందికి దింపారు.
అకస్మాత్తుగా విమానాన్ని నిలుపుదల చేసి, భద్రత సిబ్బంది తనిఖీలు చేయడంతో కొంత ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు భయపడాల్సిన పనిలేదని, వచ్చిన బాంబు బెదిరింపు కాల్ గురించి అధికారులు తెలిపారు. ఈ కాల్ గురించి, విమానాశ్రయ అధికారులు విచారణ సాగిస్తున్నారు.
Also Read: High Court on Allu Arjun: హైకోర్టులో అల్లుఅర్జున్ కు ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఆదేశం..
ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫేక్ కాల్స్ గురించి స్పందించారు. కాల్స్ విదేశాల నుండి వస్తున్నాయా.. లేక ఎవరైనా వెనుక ఉండి చేయిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణ ఆధారంగా.. బెదిరింపు కాల్స్ వెనుక కుట్ర లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. కొందరు మైనర్లు తెలిసీ తెలియక చేస్తున్న పనిగా గుర్తించామన్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ వల్ల వేల సంఖ్యలో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాగే ఎన్నో విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో, విమాన సంస్థలకు నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి ఫేక్ కాల్స్ చేసి కటకటాల పాలు కావద్దని కేంద్ర పౌర విమానయాన శాఖ కోరుతోంది.
ఇలా కేంద్ర మంత్రి ప్రకటన అనంతరం మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు కాల్ రావడంతో, అసలు ఈ కాల్స్ సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఏదిఏమైనా అత్యవసర పనుల మీద వెళ్లే ప్రయాణికులకు ఈ కాల్స్ శాపంలా మారాయని ప్రయాణికులు తెలుపుతున్నారు.