Tirumala Breaking News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమలకు అధిక సంఖ్యలో వస్తుంటారు భక్తులు. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి కూడా తిరుమలకు భక్తులు రావడం పరిపాటి. అయితే చాలా వరకు భక్తులు అలిపిరి మెట్ల మార్గం ద్వారా గోవిందా నామస్మరణ చేస్తూ.. తిరుమలకు చేరుకుంటారు. అంతేకాదు స్వామివారు తమ కోరికలు తీర్చిన వెంటనే మొక్కులు తీర్చుకునేందుకు, తమ గ్రామాల నుండి సైతం కాలినడకన తిరుమలకు యాత్రను కొనసాగిస్తారు. అటువంటి భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ పలు సూచనలు జారీ చేసింది.
ఇటీవలికాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో శ్యామలారావు పలు జాగ్రత్తలను సూచించారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదని, ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదన్నారు. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది కాబట్టి, కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది కనుక భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చని, కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు. అలాగే తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చని, దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. తిరుమలకు కాలినడకన రాదలచిన భక్తులు ఈ సూచనలను తప్పనిసరిగా పాటించి సహకరించవలసినదిగా టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు.
అలాగే,
శ్రీనివాసమంగాపురం లో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుండి 30వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు అక్టోబరు 27వ తేదీన సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 28వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబరు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు అక్టోబరు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.