Elephants Attacks : తెలుగు రాష్ట్రాల్లో ఏనుగుల గుంపులు హల్ చల్ చేస్తున్నాయి. కనిపించిన వాళ్లను తరుముతూ భీతిల్లిపోయేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురి ప్రాణాలను సైతం తీస్తున్నాయి. దీంతో జనం భయబ్రాంతులవుతున్నారు.
తెలంగాణలో ఏం జరిగిందంటే…
ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల గుంపులు నానా హైరానా సృష్టించాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు కదలికలు కలకలం రేపాయి. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఏనుగులు సంచరిస్తున్నాయని ఇటు మహా, అటు తెలంగాణ అటవీ శాఖ అధికారులు చెప్పారు.
సూచనలు చెప్పిన అటవీశాఖ…
దీంతో చింతలమనేపల్లి, బెజ్జురు, పెంచికలపేట అటవీ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అలెర్ట్ చేశారు. పెంచికలపేట మండలంలోని పలు గ్రామాల్లో డప్పు చాటింపు సైతం వేయించారు. దీంతో ప్రజలకు తగిన జాగ్రత్తలను సూచించారు.
ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో అప్రమత్తం…
ఏనుగు సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్ఓ నీరజ్ కుమార్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బెజ్జూర్, పెంచికాల్ పేట్, చింతల మానపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపులు సంచారిస్తున్నాయన్నారు. ఈ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనులకు వెళ్లే క్రమంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
మహా వైపే పయనం…
అయితే ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపు మహారాష్ట్ర సరిహద్దు వైపే పయనిస్తోందన్నారు. కానీ అవి మళ్లీ జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని, కనుక ఎవరూ వాటితో ఫొటోలు దిగడం లాంటివి చేయకూడదన్నారు. అలాగే వాటిని తరమడం కానీ వాటి వెంట వెళ్లడం కానీ ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దన్నారు.
గతేడాది ఏప్రిల్ 3న చింతలమనేపల్లి మండలం బాబాపూర్ గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అల్లూరి శంకర్ అనే రైతును దారుణంగా చంపేశాయి. ఆ తర్వాతి రోజే ఏప్రిల్ 4న పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోషన్నను సైతం హతమార్చాయి ఏనుగులు.
మళ్లీ సంచారం…
తాజాగా మరోసారి ఏనుగులు జిల్లాలోని గ్రామాల్లో సంచరిస్తున్నాయని తెలిసి గ్రామస్తులు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అయితే అటవీ శాఖ ఇచ్చే సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలని, తద్వారా వాటి బారిన పడకుండా ఉండొచ్చని అధికారులు అంటున్నారు.
ఏపీలో పరిస్థితి ఇదే…
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొంగవారిపల్లి ఎస్టీ కాలనీలో ఇవాళ ఉదయం మామిడి తోటలో ఏనుగుల గుంపు వచ్చేశాయి. సుమారు 30 నుంచి 40 గజేంద్రులు గ్రామాల్లో సంచరించాయి. ఏనుగుల గుంపులను చూసిన గ్రామస్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. డప్పు చప్పుళ్లు, పటాకులతో ఏనుగులను తరిమికొట్టేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు వాటి దారి మళ్లించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈసారి కూడా గుంపులే…
రెండు వారాల కింద ఏపీలో ఏనుగుల గుంపుల దాడిలో ఓ రైతు మరణించారు. ఈ సంఘటన మర్చిపోకముందే మరో ఘటన జరిగింది. ఈసారి ఏనుగులు గుంపులుగా వచ్చేశాయి.
ఫలితంగా పంట పొలాలపై దాడి చేశాయి. దీంతో రైతులు బెంబెలెత్తిపోయారు.వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం వాటిని అడవుల్లోకి తిరిగి పంపించారు. ఇందుకోసం అధికారులు చాలా శ్రమ పడాల్సి వచ్చింది.
also read : తప్పిన తుఫాను గండం