Delhi Liquor case : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్తోపాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రురు బెయిల్ మంజూరైంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నిందితులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో నవంబర్ 25న 10 వేల పేజీలతో ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ తొలి ఛార్జిషీట్ను సీబీఐ దాఖలు చేసింది. అయితే ఇప్పటికే మరో ఇద్దరు నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి సీబీఐ నమోదు చేసిన కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై సీబీఐకి న్యాయస్థానం నోటీసు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది. ఈ కేసు మూడు రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చుట్టూ ఈ కేసు నడుస్తోంది. ఒక వైపు సీబీఐ, మరో ఈడీ ఆధారాల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఇప్పటికే మనీష్ సిసోడియాతోపాటు ఆయన అనుచరులను దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాంగ్మూలం సీబీఐ రికార్డు చేసింది. అటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ఆరోపణలు వచ్చాయి. అటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు రిమాండ్ రిపోర్టులో ఉండటం సంచలనం రేపింది. ఇలా అనేక రాష్ట్రాలకు ఈ కేసుతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆ కోణంలో విచారణను ముమ్మరం చేశారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు షాక్ తగిలేలా నిందితులకు మధ్యంతర బెయిల్ వచ్చింది.