Deputy CM Bhatti: తెలంగాణకు కుల గణనకు అంతా సిద్ధమైంది. రేపో మాపో తెలంగాణ అంతటా సర్వే మొదలుకానుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి సర్వే ఫార్మాట్ను కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అందజేశారు.
కుల గణనపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వే ఫారాన్ని రెడీ చేయడం, ప్రభుత్వానికి అందించడం జరిగిపోయింది. అందులో కీలక మార్పులు చేశారు ప్రభుత్వ పెద్దలు. సర్వే ఫార్మాట్ను పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అందజేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అగ్రనేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు కుల గణనను అమలులోకి తేవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేసీ వేణుగోపాల్కు వివరించారు భట్టి విక్రమార్క. ఫార్మాట్ను అన్ని కోణాల్లో పరిశీలించిన ఆయన దాదాపు గా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ అంతర్గత సమాచారం. ఈ సర్వే సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కోణంలో నిర్వహిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా కులగణన అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. గణనపై అసెంబ్లీలో తీర్మానం సైతం చేసింది ప్రభుత్వం. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ALSO READ: కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ.. నాయస్థానం కీలక వ్యాఖ్యలు
దీంతో కుల గణన ప్రక్రియపై చర్చ మొదలైపోయింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేగంగా అడుగులు వేసింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించడం, ఉత్తర్వులు జారీ చేయడం జరిగిపోయింది.