Jagan : రాజమండ్రిలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ మరోసారి చంద్రబాబుపై ఎటాక్ చేశారు. కందుకూరు , గుంటూరు తొక్కిసలాట దుర్ఘటనలకు బాబే బాధ్యుడని స్పష్టం చేశారు. కందుకూరులో ఇరుకు సంధులోకి జనాన్ని నెట్టి 8మందిని బలి తీసుకున్నారని మండిపడ్డారు. గుంటూరులో డ్రోన్ షాట్ల కోసం ప్రయత్నించి మరో ముగ్గురి ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ రెండు దుర్ఘటనలు జరిగినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదన్నారు. బాబు రక్తదాహం తీరనది అన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఇలానే బలిగొన్నారని జగన్ ఆరోపించారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినా చంద్రబాబును దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడంలేదని జగన్ నిలదీశారు.
రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడంలేదని జగన్ స్పష్టం చేశారు. పేదవారు పెత్తందారీ వ్యవస్థతో పోరాటం చేస్తున్నారన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పింఛన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని నిలబెట్టుకున్నామన్నారు. పింఛన్లు కేవలం వృద్ధులకు మాత్రమే కాదు.. రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వాళ్లందరికీ అందుతున్నాయని తెలిపారు. కొత్తగా మరికొందరిని పింఛన్ల జాబితాలో చేర్చామన్నారు. ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు.. వాలంటీర్లు ఇంటికి వెళ్లి అందిస్తున్నారని స్పష్టం చేశారు.
ఇచ్చిన మాట ప్రకారమే పింఛన్లు రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేదని.. ఇప్పుడు 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ. 400 కోట్లయితే ఈ ప్రభుత్వంలో పెన్షన్లకే రూ.1,765 కోట్లు ఇస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో పింఛన్లు కావాలంటే.. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి పింఛన్ల విషయంలో వివక్ష లేదని, అవినీతికి తావు లేదని స్పష్టం చేశారు. కేవలం అర్హతనే ప్రామాణికంగా పింఛన్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని లబ్ధిదారులకు సీఎం జగన్ సూచించారు.