Korean firm Shoealls: సీఎం రేవంత్రెడ్డి విదేశీ టూర్ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ద్వారాలు ఎల్ల వేళలా తెరిచే ఉంటుందని చెప్పడంతో బిజినెస్మేన్ల దృష్టి ఇటువైపు పడింది. ఇందులో భాగంగా కొరియాకి చెందిన షూఆల్స్ కంపెనీ ముందుకొచ్చింది.
ఆగష్టులో అమెరికా, సౌత్ కొరియా టూర్ వెళ్లారు సీఎం రేవంత్రెడ్డి. అక్కడి బిజినెస్మేన్ల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం లాంటిదని, పని చేసే కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారని చెప్పారు. కంపెనీ వస్తే మా ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా ప్రొత్సాహాలు ఉంటాయని చెప్పడంతో ఇటువైపు దృష్టి సారించాయి కొన్ని కంపెనీలు.
ఈ నేపథ్యంలో సౌత్కొరియాకు చెందిన షూఆల్స్ కంపెనీ ఫోకస్ చేసింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది ఈ కంపెనీ. గురువారం ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు.
తెలంగాణాలో యూనిట్ పెట్టేందుకు ముందుకొచ్చింది షూఆల్స్ కంపెనీ. ఈ క్రమంలో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తమకు దాదాపు 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పారు.
ALSO READ: తెలంగాణ ప్రభుత్వం సహకరించకున్నా సరే, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తాం : కిషన్రెడ్డి
ఈ కంపెనీ ద్వారా దాదాపు 87 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పు కొచ్చారు. పనిలోపనిగా ‘గిగా ఫ్యాక్టరీ’ ప్రతిపాదననూ మంత్రి ముందు ఉంచారు. మెడికల్ చిప్ ఉండే బూట్లు, దీనివల్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడంతోపాటు డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఉపశమనం కలుగుతుందన్నారు.
ఓవరాల్గా పలు రకాల ఉత్పత్తుల తయారీ కోసం 750 ఎకరాల భూమి అవసరమవు తుందని ప్రతిపాదించినట్టు మంత్రి శ్రీధర్బాబు చెప్పుకొచ్చారు. భారీ పరిశ్రమ వల్ల దేశీయ అవసరాలతోపాటు ప్రపంచ మార్కెట్లకు ఇక్కడి నుంచే షూ సరఫరా చేస్తారని వివరించారు.
ప్రపంచ మార్కెట్లకు తెలంగాణా హబ్గా మారుతుందన్నారు. బూట్ల అడుగు భాగాన జీపీఎస్ ఉండడం వల్ల పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ట్రాక్ చేసే అవకాశముంది. ఈ షూ ధరించిన వారు యాక్సిడెంట్కు గురైనా, మరే ఆపదలో చిక్కుకున్నా కుటుంబ సభ్యులకు సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉందని వివరించారు.
దీంతోపాటు మరో ప్రణాళికను సైతం కొరియా ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం ముందుపెట్టారు. అమెరికాలో ఫేమస్ అయిన జాన్ హాప్కిన్స్ లాంటి హాస్పటళ్లను తీసుకొస్తామన్నారు. ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలు, బయో మెడికల్ సెంటర్లు, యాన్సిలరీ పరిశ్రమల కోసం 5,000 ఎకరాలు కేటాయిస్తే ఏషియాలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ హెల్త్ సిటీని నెలకొల్పే ప్రతిపాదనలను కొరియా బృందం చేసిందన్నది మంత్రి శ్రీధర్బాబు మాట.