Sunil kanugolu : కాంగ్రెస్ వార్ రూమ్ కేసుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయనను వెంటనే అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అలాగే సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందేనని సునీల్ కనుగోలుకు స్పష్టం చేసింది.
తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మీమ్స్ వీడియోల కేసులో సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు ఇచ్చారు. తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి సామ్రాట్ చేసిన ఫిర్యాదుతో గతేడాది నవంబర్ 24న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీని దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంగా పోలీసులు డిసెంబర్ 13న రాత్రి మాదాపూర్లోని మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై దాడి చేశారు. అక్కడ పట్టుబడిన ముగ్గురి విచారించగా సునీల్ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది.
విచారణకు రాకపోతే అరెస్టు సహా ఇతర చర్యలు తీసుకుంటామని సునీల్ కనుగోలుకు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ సీఆర్పీసీ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో తనకు సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. ఎఫ్ఐఆర్లో సునీల్ కనుగోలు పేరు తొలగించాలని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఎఫ్ఐఆర్ లో ఏ1 నిందితుడిగా ఉన్న సునీల్ ను ప్రశ్నించేందుకు అనుమతించేలా ఆదేశించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు… ఈ నెల 8న సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అదే సమమంలో సునీల్ కనుగోలును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు స్పష్టం చేసింది.