Tirumala Darshan Update Today: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. అసలే దీపావళి పర్వదినం రాబోతోంది. దీపావళి ఆస్థానం సైతం స్వామి వారి సన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 61004 మంది భక్తులు దర్శించుకోగా.. 20173 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.48 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా 9 కంపార్ట్ మెంట్ లలో భక్తులు, స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు.
Also Read: Elinati Shani: మకరరాశి వాళ్లు వచ్చే ఆరు నెలలు జాగ్రత్త.. లేదంటే..?
తిరుమలలో ఈ తప్పు చేయవద్దు సుమా..
తిరుమలలోని ప్రతి అణువణువు పవిత్రమైనది. ఇక్కడి మన్నును కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు, శ్రీవారిపై నిశ్చలమైన భక్తితో వస్తారు. అయితే తెలిసీ తెలియక ఈ తప్పు చేస్తుంటారు భక్తులు. అదేమిటంటే.. తిరుమలలోని మాఢవీధుల్లో చెప్పులు ధరించి తిరగడం. పవిత్రమైన మాఢవీధుల్లో శ్రీవారి దర్శనభాగ్యం కలుగుతుంది కాబట్టి, మాఢవీధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలు వేసుకొని తిరగకూడదు. ఇక్కడ పాదరక్షలు వేసుకుని తిరగరాదని బోర్డు కూడా ఉంటుంది కానీ, ఆ విషయాన్ని గమనించక ఎక్కువ సంఖ్యలో భక్తులు పాదరక్షలు ధరిస్తారు. అందుకే తిరుమలకు వెళ్తే ఈ తప్పు మాత్రం చేయవద్దు సుమా!