Hombale Films : సౌత్ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను దాటేశాయి. వైవిధ్యమైన కథా చిత్రాలతో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాయి. ముఖ్యంగా హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది ఈ బ్యానర్ నుంచి రిలీజైన క్రేజీ ప్రాజెక్టులతో కలెక్షన్స్ పరంగా సెన్సేషనల్ రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు హోంబలే ఫిలింస్ సంస్థ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. అందులో ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ 31 చిత్రాలు సహా పలు చిత్రాలు లైనప్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హోంబలే ఫిలింస్ సోమవారం రోజున ఓ సంచలన ప్రకటనను వెలువరిచింది. అదేంటంటే రానున్న ఐదేళ్లలో సినిమా రంగంలో రూ.3000 కోట్లు పెట్టుబడులుగా పెట్టబోతున్నామని ప్రకటిచింది. ఓ నిర్మాణ సంస్థ ఇంత మొత్తం వెచ్చించటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇదే తొలిసారి అనటంలో సందేహం లేదు. హోంబలే ఫిలింస్ నుంచి వచ్చిన ఈ సంచలన ప్రకటనపై యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ వర్గాలే కాదు.. బయట వ్యక్తులు కూడా నోరెళ్ల బెడుతున్నారు. హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులకు తమ బ్యానర్ నుంచి ధన్యవాదాలు తెలిపారాయన. ఈ గొప్ప ప్రయాణానికి ప్రేక్షకులు అందించిన ఆశీర్వాదాలే కారణమని ఆయన తెలిపారు. మరి ఈ బ్యానర్ నుంచి ఇంకా ఎలాంటి భారీ బడ్జెట్ మూవీస్ రానున్నాయో చూడాలి మరి.