Mahesh Kumar on KTR: తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా తన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురి కావడంపై ఏఐసీసీకి లేఖ రాయగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
ఇటీవల జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని దుండగులు హత్యకు పాల్పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి జీవన్ రెడ్డి రహదారిపై బైఠాయించి నిరసన సైతం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో, కాంగ్రెస్ నేతలకే రక్షణ లేదంటూ.. ప్రభుత్వంపై సైతం విమర్శలు చేశారు జీవన్ రెడ్డి.
దీనితో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు రంగ ప్రవేశం చేసి, జీవన్ రెడ్డితో మాట్లాడారు. సాక్షాత్తు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోన్లో జీవన్ రెడ్డితో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ససేమిరా మాట వినని జీవన్ రెడ్డి నేడు ఏఐసీసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది.
ఈ లేఖపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి అన్ని రకాలుగా సేవలు అందించారని, పార్టీ కష్టకాలంలో జీవన్ రెడ్డి అందించిన సేవలు అధిష్టానం కూడా మరువలేదన్నారు. అలాగే జీవన్ రెడ్డికి సైతం పార్టీ కీలక పదవులను అప్పగించిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ విషయం కూడా ఏఐసీసీ పెద్దలకు తెలుసని, వారి కనుసన్నుల్లోనే చేరికలు జరిగాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాలలో ఎక్కడా సమస్య లేదని, కేవలం జగిత్యాల జిల్లాలో ఆ సమస్య ఉన్నట్లు తాము గుర్తించడం జరిగిందన్నారు. రెండు, మూడు రోజుల్లో సమస్య తీరుతుందని, ఇప్పటికే జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చిస్తున్నారన్నారు. అలాగే జీవన్ రెడ్డి అధిష్టానానికి పంపిన లేఖను తాము సైతం పరిశీలిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతిగా గుర్తింపు పొందిందని, హైడ్రా పేరుతో పేదల గృహాలను కూల్చివేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రచారం చేయడం తగదన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో దుబాయ్ కేంద్రంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారని, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకొని కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పట్ల బీఆర్ఎస్ సానుకూలంగా స్పందించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజారంజక పాలన సాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.