GST Collections : దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. 2022 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలకు చేరాయి. 2021 డిసెంబరుతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. అలాగే వరుసగా పదో నెలలోనూ జీఎస్టీ వసూళ్లు లక్షా 40 వేల కోట్ల రూపాయలను దాటడం విశేషం.
డిసెంబర్ నెలలో రూ.1,49,507 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజీఎస్టీ కింద రూ. 26,711 కోట్లు.. ఎస్జీఎస్టీ కింద రూ.33,357 కోట్లు వసూలైనట్లు తెలిపింది. అలాగే ఐజీఎస్టీ కింద రూ.78,434 కోట్లు సమకూరినట్లు ప్రకటించింది. ఇక సెస్సుల రూపంలో రూ.11,005 కోట్లు వసూలయ్యాయి. నవంబరుతో పోలిస్తే డిసెంబర్లో 2.5 శాతం ఎక్కువగా జీఎస్టీ వసూలైంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక… ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్లో ఏకంగా రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. సీజీఎస్టీ కింద రూ.33,159 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.41,793 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.8,939 కోట్లు వసూలయ్యాయి. సెస్సుల రూపంలో రూ.10,649 కోట్లు వచ్చాయి. అందులో కేంద్రానికి రూ.63,380 కోట్లు, రాష్ట్రాలకు రూ.64,451 కోట్లు దక్కాయి.
తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే… ఏపీలో డిసెంబర్లో రూ.3,182 కోట్ల జీఎస్టీ వసూలైంది. 2021 డిసెంబర్లో రూ.2,532 కోట్ల జీఎస్టీ వసూలు కాగా.. ఈ ఏడాది 26% వృద్ధి నమోదైంది. తెలంగాణలో 2021 డిసెంబరులో వసూలైన రూ.3,760 కోట్లతో పోలిస్తే… 2022 డిసెంబర్లో 11 శాతం అధికంగా రూ.4,178 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో 12 రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి కనిపించగా… 13 రాష్ట్రాల్లో క్షీణించింది. అత్యధికంగా లద్దాఖ్లో 68 శాతం వృద్ధి కనిపించగా… అత్యధికంగా గోవా వసూళ్లలో 22 శాతం క్షీణత నమోదైంది.