Chandrababu on Jagan: గత రెండు రోజులుగా మాజీ సీఎం వైయస్ జగన్ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల వివాదం సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తమ ఆస్తులకు సంబంధించి వైఎస్ జగన్, ఇటీవల తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ పై కోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందిస్తూ షర్మిళ కూడా జగన్ కు ఉత్తరం రాశారు. ఇప్పటికే ఈ వివాదంపై జగన్, షర్మిళ మధ్య వాదోపవాదాలు సాగుతుండగా, తాజాగా సీఎం చంద్రబాబు సైతం స్పందించారు.
తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ మధ్య సాగుతున్న ఆస్తి వివాదానికి సంబంధించి స్పందించారు. సీఎం మాట్లాడుతూ కుటుంబానికి సంబంధించిన గొడవలోకి టీడీపీని లాగడం తగదన్నారు. తల్లి విజయమ్మతో, చెల్లి షర్మిళతో గొడవ పడుతున్న జగన్, అనవసరంగా టిడిపి పై విమర్శలు చేస్తున్నట్లు, చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా జగన్ మానుకోవాలని సీఎం సూచించారు.
తండ్రి సంపాదించిన ఆస్తి, ఆయన భార్యకు వస్తుందా రాదా అంటూ సీఎం ప్రశ్నించారు. జగన్ కు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. విలువ లేని మనుషులు సమాజానికి చేటుగా పేర్కొన్న సీఎం చంద్రబాబు, తనను ఐదేళ్లు ఇంట్లో నుండి బయటకు రానివ్వకుండా తన పరిపాలన సమయంలో వైయస్ జగన్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. ప్రస్తుతం ఇంట్లో నుంచి బయటకు రాకుండా జగన్ ను ఆపేందుకు తాము ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తమ ప్రభుత్వం నైజం అది కాదని చంద్రబాబు అన్నారు.
వివేకాను కూడా మేము చంపేశామని తప్పుడు ప్రచారం చేశారు. చెత్త టీవీ, చెత్త పేపర్తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు ఏ చెత్త చెప్పినా ప్రజలు నమ్మేస్తారని అనుకున్నారా అంటూ సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. చెల్లికి ఆస్తి ఇవ్వటానికి కండీషన్ పెడతాడా? జగన్ మీద, అవినాష్ మీద రాజకీయంగా మాట్లాడవద్దు, మాట్లాడకపోతేనే ఆస్తి ఇస్తా అంటానని చెప్పడం జగన్ కే చెల్లిందన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని ఊహించలేదని, చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.. ఛీ ఛీ.. ఇలాంటి వారితో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉందంటూ సీఎం వ్యంగ్యంగా మాట్లాడారు.
అలాగే గుర్ల గ్రామంలో పర్యటించిన జగన్, తన కుటుంబ వివాదంపై మాట్లాడుతూ.. అన్ని కుటుంబాలలో ఉండే తగాదాలు తమ కుటుంబంలో కూడా ఉన్నాయని, అయితే కూటమి, తమ కుటుంబ సభ్యుల ఫోటోలతో డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతుందన్నారు. ఈ కామెంట్స్ పై తాజాగా షర్మిళ స్పందించారు. ఎవరి కుటుంబంలోనైనా వివాదాలు ఉంటాయని, అయితే తల్లి, చెల్లిపై కోర్టులో కేసులు వేయరన్నారు. ఇలా మాజీ సీఎం జగన్, వైయస్ షర్మిళ మధ్య ఆస్తుల వివాదం రాజుకోగా, జగన్ మాత్రం టీడీపీ లక్ష్యంగా కామెంట్స్ చేయడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మరి ఈ కామెంట్స్ పై జగన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.