Telangana High Court : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును ఇవాళ హైకోర్టు విచారించింది. ఈ మేరకు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.
సమయం కావాలి…
ఈ సందర్భంగా వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోరారు. ఫలితంగా కేసు విచారణను వచ్చే నెల 4కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…
బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆ పార్టీ కేసు వేసింది. వీరిపై అనర్హత వేటు వేసేలా శాసనసభాపతికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టు గడప తొక్కారు.
సింగిల్ బెంచ్ ఏం చెప్పిందంటే…
ఈ మేరకు వారి పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై వివరాలు చెప్పేందుకు 4 వారాల గడువు ఇస్తున్నామని ప్రభుత్వానికి చెప్పింది.
ఈలోగా పూర్తి వివరాలతో రాకుంటే తామే తగిన ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని అసెంబ్లీ కార్యదర్శిని హెచ్చరించింది.
వచ్చే నెల 4కి వాయిదా…
ఈ నేపథ్యంలోనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. దీనిపై గురువారం విచారించిన కోర్టు, తదుపరి విచారణను వచ్చే నెల 4తేదీకి వాయిదా వేస్తూ తీర్పును ఇచ్చింది.