Rajanna Sircilla Police: సలామ్ పోలీసన్న.. సరిలేరు నీకెవరన్నా.. ఈ పాట వింటే పోలీసుల త్యాగాలు, వారి కృషి మనకు ఇలా గుర్తుకు రావాల్సిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అయితే ఈ వారోత్సవాలు జరుగుతున్న సమయంలో, పోలీస్ కుటుంబాలు రోడ్డెక్కాయి. సాధారణంగా ఎవరైనా నిరసన తెలిపితే అరెస్ట్ చేసే పోలీసులు, తమ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసి, పోలీస్ వ్యాన్ ఎక్కించారు. ఇంతకు ఈ అరెస్ట్ గల కారణాలు, అసలు పోలీస్ కుటుంబాలు ఎందుకు రోడ్డెక్కాయో తెలుసుకుందాం.
సిరిసిల్ల పరిధిలో 17వ పోలీస్ బెటాలియన్ ఉంది. ఇక్కడి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం భాగస్వామ్యం అవుతారు. అయితే ఈ బెటాలియన్ పోలీసుల భార్యలు ఒక్కసారిగా గురువారం సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీనితో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు.
ఈ సందర్భంగా పోలీసుల సతీమణులు మాట్లాడుతూ.. తమ భర్తలకు విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేసి, తమ సంసార కుటుంబాన్ని దూరం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల పోలీస్ విభాగాలకు ఒకే పోలీస్ విధానం ఉండాలని వారు డిమాండ్ చేశారు. తమ పిల్లల ఆరోగ్య స్థితిగతులను సైతం పట్టించుకోలేని స్థితిలో 17వ బెటాలియన్ పోలీసులు ఉన్నారని, వెంటనే ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
ఆ సమయంలో అదే మార్గం గుండా వెళుతున్న మాజీ మంత్రి కేటీఆర్, నిరసన చేస్తున్న పోలీసులు భార్యలతో మాట్లాడారు. అనంతరం బెటాలియన్ పోలీసు ఉన్న ప్రాధికారులతో మాట్లాడిన కేటీఆర్, సాధ్యమైనంత తొందరగా కానిస్టేబుల్ సమస్యలను తీర్చాలని సూచించారు. లేని ఎడల అవసరమైతే తాము పార్టీ తరపున అండగా ఉండి నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని కేటీఆర్ అన్నారు.
Also Read: Love Breakups: ముందు ప్రేమ.. ఆ తర్వాత ఇంకేముంది అదే.. పెరుగుతున్న లవ్ బ్రేకప్స్.. కారణం అదేనా?
చివరకు నిరసన తెలుపుతున్న పోలీసుల భార్యలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ వ్యాన్ లో బెటాలియన్ కు తరలించారు. ఏది ఏమైనా నిత్యం ప్రజారక్షణలో భాగమైన పోలీసుల కుటుంబాలు రోడ్డెక్కడం, అది కూడా పోలీసుల సంస్మరణ వారోత్సవాల సమయంలో నిరసన తెలపడం సంచలనంగా మారింది. తమ భర్తల కోసం రోడ్డెక్కిన ఈ మహిళల, సమస్య పరిష్కారానికి పోలీస్ ఉన్నతాధికారులు త్వరగా చొరవ చూపేలా ప్రభుత్వం కూడా స్పందించిందని తెలుస్తోంది.