MLC Jeevan Reddy: పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించు కోలేకపోతున్నానని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి. ఫిరాయింపు నేతలు వచ్చి పార్టీలో ఉన్న పాతతరం నేతలపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నైతిక విలువలకు నేతలు కట్టుబడి ఉండాలన్నారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
గురువారం హైదరాబాద్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశానని చెప్పుకొచ్చారు. చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని కొందరు నేతలు బయట పడుతున్నారని చెప్పకనే చెప్పారు.
ఇలాంటి పరిణామాలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే సభ్యత్వం రద్దు చేసే విధంగా చట్టాలు ఉండాలని రాహుల్గాంధీ పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రం ఏర్పాటు కావడం, దానికి అనుగుణంగా అగ్రనేత రాహుల్గాంధీ భారత్ జూడో యాత్ర చేపట్టడంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది. రేవంత్ ఆధ్వర్యంలో సుస్థిరత ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో కొన్ని స్వార్థ పూరిత శక్తులు అభివృద్ధి నెపంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి టెన్షన్.. వణికిపోతున్న ప్రజలు
ప్రభుత్వం కూడా దీనికి తలొగ్గడం, స్థానిక కాంగ్రెస్ నాయకత్వం కొంత ఆందోళనకు గురి చేసిందన్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, పార్టీ ఆలోచనకు అనుగుణంగా అడుగులు వేస్తున్నానని వివరించారు.
2014లో బీఆర్ఎస్ గాలి బలంగా వీస్తున్నా నిలబడ్డానని వివరించారు జీవన్రెడ్డి. బీఆర్ఎస్ దౌర్జన్యాలను ఎదురించి పోరాడామని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ క్షీణించి పోయిందన్నారు. ఆ పార్టీ సభ్యులు కాంగ్రెస్లోకి వచ్చి పార్టీని నమ్ముకున్నవారిపై ఆధిపత్యం చెలాయించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.