Vivekam Movie : వైసిపి అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan), ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మధ్య ఆస్తి తగాదాలు కోర్టుకెక్కిన విషయం సంచలనంగా మారింది. అయితే తల్లి, చెల్లిపై ఆస్తులు కోసం ఆయన కేసులు ఫైల్ చేసిన విషయాన్ని ముందుగానే ఓ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చూపించారు మేకర్స్. ఆ సినిమాలో చూపించిన డైలాగులే నిజం అయ్యాయి అంటూ సదరు సినిమాకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఆ సినిమా ఏంటి? అనే విషయంలోకి వెళ్తే….
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తాజాగా ఒక కంపెనీలో వాటాల గురించి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీలో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 12న వైయస్ జగన్ కు షర్మిల, విజయమ్మ రాసిన లేఖలను టిడిపి తాజాగా ఎక్స్ వేదికగా బయట పెట్టింది. నిజానికి నిన్ననే ‘బిగ్ ఎక్స్పోజ్.. రేపు 12 గంటలకు’ అంటూ టిడిపి సోషల్ మీడియా వేదికగా క్యూరియాసిటీని పెంచేసింది. ఇక అందులో భాగంగానే తాజాగా ఈ లేఖలను బయట పెట్టగా అందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సూచించిన విధంగా ఉమ్మడి ఆస్తులు పంచాలని వైయస్ షర్మిల తో పాటు ఆమె తల్లి విజయమ్మ కోరడం కనిపించింది. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి నో చెప్పడం కనిపిస్తోంది.
అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో తన సోదరి షర్మిల కు రాసిన లేఖలో వైయస్ జగన్ (YS Jagan) తన భార్య భారతి తో పాటు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడకూడదు అంటూ పలు షరతులు విధించినట్టుగా తెలుస్తోంది. కానీ షర్మిల, విజయమ్మ దీని గురించి స్పందించకపోవడం గమనార్హం. సెప్టెంబర్ 12న షర్మిల జగన్ కు ఓ లేఖ రాశారు. అందులో 10 కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఆస్తుల విషయంలో తండ్రి ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ ఆలోచిస్తున్నారని, తనకు తీరని ద్రోహం చేశారని, తన తండ్రి కలలో కూడా ఊహించని విధంగా తనపై తన తల్లిపై కేసులు పెట్టారని షర్మిల ఆవేదనను వ్యక్తం చేశారు. అప్పుడు తండ్రి మాట ప్రకారం ఆస్తుల పంపకాల విషయంలో హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారంటూ షర్మిల ఆరోపించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం సంచలనం సృష్టిస్తుండగా నిజానికి ఇదంతా జరగకముందే ఓ సినిమా ద్వారా తెరపై చూపించారు మేకర్స్.
దివంగత నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ (Vivekam Movie) అనే సినిమాలో అచ్చు గుద్దినట్టుగా ఈ సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో సిబిఐ చార్జ్ షీట్, దస్తగిరి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వైయస్ వివేకా రాజకీయ కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు సంబంధించి ముందు వెనక జరిగిన పరిణామాలను చూపించారు. ఆ సినిమాలో షర్మిల ఆమె తల్లికి ‘జగన్, భారతి తల్లి, చెల్లిని ఏదో ఒకరోజు రోడ్డుపై నిలబెడతారు’ అంటూ వైఎస్ వివేకానంద రెడ్డి చెప్పడం చూడవచ్చు. ఈరోజు అదే నిజమైంది. తండ్రి ఆదర్శాలు పాటిస్తున్నా అంటూనే దుర్బుద్ధితో ఆస్తుల కోసం తల్లి, చెల్లిని రోడ్డుపై నిలబెట్టిన జగన్ పై తీవ్ర విమర్శలు విన్పిస్తున్నాయి. కాగా 2024 లోనే వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్ లో కూడా ఫ్రీగానే అందుబాటులో ఉంది.