Electric Two-Wheelers : దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లపై జనానికి మోజు తగ్గింది. 2022 డిసెంబర్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. కొన్ని వాహనాలు మంటల్లో కాలిపోవడం, మరికొన్ని వాహన ప్రమాదాల్లో ఏకంగా ప్రాణాలే పోవడంతో… ఎలక్ట్రిక్ టూ వీలర్లు కొనాలన్న నిర్ణయాన్ని చాలా మంది మార్చుకున్నారని, అందుకే విక్రయాలు తగ్గాయని చెబుతున్నారు. 2022 నవంబర్లో 76,162 ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్ముడుపోగా… డిసెంబర్లో 28 శాతం తగ్గి 59,554 ఎలక్ట్రిక్ టూ వీలర్లే అమ్ముడుపోయాయి. ఇక 2022లో మొత్తం 6 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్ముడుపోయాయి.
3 ప్రధాన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థలైన హీరో ఎలక్ట్రిక్, ఓలా, ఒకినవా… 2022లో తొలిసారి 1 లక్ష వార్షిక విక్రయాలను సాధించాయి. దేశంలో ఈ మూడు సంస్థలకు 50 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో మొత్తం 5 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్లే అమ్ముడుపోయాయని, ఇదే తీరు కొనసాగితే… నీతి ఆయోగ్ అంచనా వేసిన 10 లక్షల యూనిట్ల లక్ష్యానికి 20 శాతం దూరంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ ఆగిపోవచ్చని భావిస్తున్నారు.
ప్రభుత్వం రూ. 1,100 కోట్ల సబ్సిడీని విడుదల చేయకుండా ఆపి ఉంచడం కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. ఫేమ్ ఇండియా ఫేజ్ 2 స్కీమ్ కింద ఇస్తున్న సబ్సిడీలను కొన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు రావడంతో… సబ్సిడీ విడుదలను నిలిపివేసిన కేంద్రం… రెండు కంపెనీలను, వాటి మోడల్స్ను ఫేమ్ స్కీమ్ నుంచి సస్పెండ్ చేసింది. కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నామనే ఆధారాలు సమర్పించేదాకా వాటి క్లెయిమ్ ప్రాసెసింగ్ను నిలిపివేసింది. బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ, ఒకాయా ఈవీ, జితేంద్ర న్యూ ఈవీ టెక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, రివోల్ట్ ఇంటెలికార్ప్, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్, ఏవన్ సైకిల్స్, లోహియా ఆటో ఇండస్ట్రీస్, ఠుక్రాల్ ఎలక్ట్రిక్ బైక్స్, విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలు… సబ్సిడీలను దుర్వినియోగం చేశాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.